NTV Telugu Site icon

Off The Record : ఎమ్మెల్సీ సీటు విషయమై కేసీఆర్‌, కేటీఆర్‌ మధ్య ఏం జరిగింది..?

Brs

Brs

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మధ్య ఓ వ్యవహారం నువ్వా నేనా అన్నట్టుగా నడిచిందా? ఎమ్మెల్సీ సీటు విషయంలో తండ్రీ కొడుకులిద్దరూ పరస్పరం పట్టుదలకు పోయారా? చివరికి కొడుకే తన పంతం నెగ్గించుకున్నారా? చివరికి కవిత ముందే చెప్పిన పేరు కూడా పక్కకు పోయిందా? ఎమ్మెల్సీ సీటు విషయమై కేసీఆర్‌, కేటీఆర్‌ మధ్య ఏం జరిగింది? గులాబీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నడుస్తోంది. నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎవరి కోటా మేరకు వాళ్ళు నామినేషన్‌ వేశారు. ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్‌ రెండో అభ్యర్థిని బరిలో దింపుతుందని ముందుగా ప్రచారం జరిగినా… బలం ఉన్నమేరకే అభ్యర్థిని పెట్టింది. అంతవరకు బాగానే ఉన్నా… పార్టీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ ఎంపిక వెనక హైడ్రామా నడిచిందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది గులాబీ వర్గాల్లో. అవకాశం ఉన్నది ఒక్క సీటుకే కావడం, పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో… ఛాన్స్‌ ఎవరికి దక్కుతుందంటూ ఉత్కంఠ రేగింది. డజన్ మందిదాకా ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేసుకున్నారు. తాజా మాజీలతోపాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు కేసీఆర్, కేటీఆర్‌, కవిత, హరీష్‌రావు… ఇలా ఎవరి సోర్స్‌లో వారు ట్రయల్స్‌ వేశారట. కానీ…. చివరికి దాసోజు శ్రవణ్‌కు ఛాన్స్‌ రావడంతో…. అదెలా అంటూ ఆరాలు తీస్తున్నారట చాలా మంది గులాబీ నాయకులు. ఇక్కడే కేటీఆర్‌ కీ రోల్‌ పోషించారన్న మాట గట్టిగా వినిపిస్తోంది పార్టీ వర్గాల నుంచి. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్‌లో ఉన్న దాసోజు… మొదటి నుంచి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడన్న పేరుంది. మధ్యలో పార్టీ వదిలిపెట్టి వెళ్లినా… కేటీఆర్ ప్రోద్బలంతోనే… తిరిగి బీఆర్ఎస్‌లో చేరినట్టు చెప్పుకుంటారు. గతంలో గవర్నర్ కోటాలో ఆయన్ని ఎమ్మెల్సీగా పంపే ప్రయత్నం జరిగింది. కానీ అప్పుడున్న గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆ ఎంపికను తప్పుపట్టారు.

గవర్నర్‌ కోటాలో రాజకీయ నేతల్ని ఎలా పంపుతారంటూ పక్కన పెట్టేయడంతో… శ్రవణ్‌కు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. అప్పటినుంచి ఎదురుచూస్తున్న శ్రవణ్‌కు ఇప్పుడు ఛాన్స్‌ దక్కింది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌కు వెళ్లడంతో…. అక్కడ దాసోజును ఇన్ఛార్జ్‌గా పెట్టి ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే… పార్టీ అభ్యర్థిగా ఆయన్నే బరిలో దింపుతారని అనుకున్నారు. కానీ… ఆ క్లారిటీ తేలకముందే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో… ఉన్న ఒక్క ఛాన్స్‌ శ్రవణ్‌కు ఇచ్చేశారట.అయితే… ఈ ఎంపిక టైంలో.. పెద్ద హైడ్రామానే నడిచిందన్నది గులాబీ వర్గాల ఇన్‌సైడ్‌ టాక్‌. శ్రవణ్‌ విషయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ అంత సానుకూలంగా లేకున్నా…. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పట్టుబట్టి మరీ సాధించుకున్నారన్న ప్రచారం ఉంది. మీరేం చేసుకుంటారో చేసుకోండి… దాసోజుకు మాత్రం ఇచ్చి తీరాల్సిందేనని ఒక దశలో పార్టీ వ్యవహారాలకు సైతం దూరంగా ఉన్నట్టు సమాచారం. ఈ సీటు విషయంలో తండ్రీ కొడుకుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహారం నడిచిందని, చివరికి కేటీఆర్‌ పట్టుబట్టి తన మనిషి కోసం సాధించుకున్నారన్నది బీఆర్‌ఎస్‌ ఇన్‌సైడ్‌ టాక్‌. దాసోజును అభ్యర్థిగా ప్రకటించడంతోపాటు నామినేషన్‌ ప్రక్రియ మొత్తాన్ని దగ్గరుండి చూసుకున్నారు కేటీఆర్‌. మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పార్టీలో కీలకంగా ఉన్న మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం పార్టీలోని మిగతా ముఖ్యులు ప్రయత్నించినా… చివరికి కేటీఆర్‌ పంతమే నెగ్గిందని అంటున్నారు. ఈసారి ఎమ్మెల్సీ ఛాన్స్‌ని సత్యవతి రాథోడ్‌కి ఇస్తామని గతవారం మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు కవిత. అయినా… శ్రవణ్‌కే ఛాన్స్‌ దక్కడంతో…. మొత్తంగా కేటీఆర్‌ పంతమే నెగ్గిందని మాట్లాడుకుంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు.