Site icon NTV Telugu

Off The Record: పబ్లిసిటీ పీక్స్లో ఉన్న వాళ్ల ర్యాంకింగ్స్ వీక్గా ఉన్నాయా..?

Vsp Tdp Mlas Otr

Vsp Tdp Mlas Otr

Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో పొలిటికల్ డైనమిక్స్ ఎప్పుడూ డిఫరెంట్‌గానే వుంటాయి. ఇక్కడ పార్టీల ప్రభావం ఎంత వుంటుందో….నేతల సీనియార్టీకి తగ్గ గౌరవం కూడా అలాగే ఉంటుంది. అధికారంలో వున్నా…లేకపోయినా తమ మధ్య ఉండేవాళ్ళకే వాళ్ళకే తిరిగి ఛాన్స్‌ ఇస్తుంటాకు ఇక్కడి ఓటర్లు. ఈ క్రమంలో… 2024 ఎన్నికల్లో కూటమి విజయం ప్రభంజనమైతే….ఇక్కడ శాసనసభ్యులు సాధించిన మెజార్టీలు మోత మోగించాయి. వైసీపీ గెలిచిన పాడేరు, అరకు స్ధానాలను మినహాయిస్తే ఉమ్మడి జిల్లా మీద కూటమి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా రాజకీయంగా, సామాజికంగా గట్టిపట్టున్న వాళ్ళే. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాస్ ఓటమి తెలియకుండా రాణిస్తున్నారు. అటు స్పీకర్ అయ్యన్న, హోం మంత్రి అనిత రాజకీయ దూకుడును తట్టుకోవడం ప్రతిపక్షాలకు మొదటి నుంచి ఇబ్బందికరమేనన్న అభిప్రాయం ఉంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్నప్పటికీ రాజకీయ చురకలు అంటించడంలోనూ, అధికారుల తీరును ఎండగట్టి గట్టిగా పనిచేయించుకోవడంలోనూ అయ్యన్నది డిఫరెంట్ స్టైల్. ఇక హోం మంత్రి అనిత అయితే… వైసీపీ మీదికి ఒంటి కాలితో లేస్తుంటారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటకు ఇటీవల పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయి.

ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీ కృష్ణ యాదవ్ వంటి వాళ్ళు అదను చూసి రాజకీయ అస్త్రాలను సంధించడంలో దిట్టలు. అర్బన్ నియోజకవర్గాలు కావడంతో వీళ్ళు గెలిచిన దక్షిణ, ఉత్తర స్ధానాల్లో అభివ్రుద్ధికి స్కోప్ ఎక్కువ. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తుండగా అటు కూటమిలోనూ… ఇటు పాలనపరంగానూ పట్టు సాధించినట్టు పైకి కనిపించారు సీనియర్ శాసనసభ్యులు. అయితే… ఇదంతా నేతి బీరకాయ వ్యవహారమేనని తాజా నివేదికలో తేలిపోయిందన్న చర్చ జరుగుతోంది విశాఖ రాజకీయవర్గాల్లో. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించింది. ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ఇండికేటర్స్‌ను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాలకు గ్రేడింగ్ ఇచ్చింది. ఈ జాబితాలో రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్ గాజువాకకు దక్కితే…. టాప్ టెన్‌లో విశాఖ పశ్చిమం, మాడుగుల అసెంబ్లీ స్ధానాలు నిలిచాయి. అంతేతప్ప… జనసేన ఎమ్మెల్యేలు ఉన్న 4 స్ధానాలు, బీజేపీ గెలిచిన విశాఖ ఉత్తరం సహా స్పీకర్, హోం మంత్రి ప్రాతినిధ్య వహిస్తున్న నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాలకు టాప్‌ లిస్ట్‌లో స్ధానం లేకుండాపోయింది. అదే సమయంలో సీనియార్టీతో పాటు సిన్సియర్‌గా నియోజకవర్గాలను అంటిపెట్టుకుని పనిచేస్తున్నారనే ఫీడ్ బ్యాక్ వున్న పల్లా, గణబాబు, బండారు ర్యాంకింగ్స్‌లోకి వచ్చేశారు. ఇవి ఎమ్మెల్యేల పనితీరుకు వచ్చిన మార్కులు కాదని, నియోజకవర్గాల్లో అభివృద్ధి ఆధారంగా జరిగిన సర్వే అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా…. లోకల్‌గా సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేయాల్సింది ఎమ్మెల్యేలే.

అందుకే… ఈ ర్యాంకింగ్స్‌ వాళ్ళకు కూడా వర్తిస్తాయని అంటున్నారు. రాజకీయంగా నిత్యం ప్రజల నోళ్ళలో నానుతూ… వీళ్ళు సూపర్‌ అంటూ… హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేసే నేతలు ర్యాంకుల్లో వెనకబడితే….జనంలో వుండి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు మార్కులు పడ్డాయి. ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువగా వుండే గాజువాక,
పశ్చిమ స్ధానంతో పాటు అభివ్రుద్ధికి దూరంగా నిలిచిపోయిన మాడుగుల స్ధానాల్లో సమస్యలు ఎక్కువ. ఇక్కడ ప్రభుత్వం మాత్రమే పరిష్కరించగలిగే జఠిలమైనవి చాలా వుంటాయి. అటువంటి క్లిష్టమైన నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు వస్తే… అన్ని రకాల మౌలిక వసతులు ఉన్న నియోజవర్గాలు వెనుకబడటం చర్చనీయాంశంగా మారింది. సర్వే నివేదకల ఆధారంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకుంటూ… విధానాల అమలుకు కోసం సీఎం ప్రాధాన్యత ఇస్తుంటారు. వీటినే గీటురాయిగా తీసుకుని శాసనసభ్యుల సామర్ధ్యాలను అంచనా వేసి అందుకు తగ్గ అవకాశాలు కల్పించిన సందర్భాలు వున్నాయి. ఇక త్వరలో మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సీనియర్ ఎమ్మెల్యేలు చాలా మందే వున్నా రు. ఇటువంటి పరిస్ధితుల్లో నియోజకవర్గాల ర్యాంకింగ్ అంశం హాట్ టాపిక్ అయింది. ఇది ఎమ్మెల్యేల పనితీరుకు ప్రాతిపదికా కాదా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… రాజకీయ అవకాశాలకు మాత్రం ఖచ్చితంగా ప్రాతిపదికేన్నది విస్తృతాభిప్రాయం. తాజా ర్యాంకింగ్స్‌లో వెనకబడ్డ ఎమ్మెల్యేలు దీన్ని పరిగణనలోకి తీసుకుంటే వాళ్ళకే మంచిదని సూచిస్తున్నారు పొలిటికల్ పండిట్స్‌.

Exit mobile version