Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు

  • 22A నిషేధిత జాబితాలో తాడిపత్రి పట్టణంలోని 2.4 ఎకరాలు..
  • భూమిని అక్రమంగా కాజేశారన్న ఆరోపణలు..
  • భూ రికార్డుల్లో కొట్టివేతలు, రెండు పేజీలు మాయం..
  • కలెక్టర్‌ సీరియస్‌, నలుగు అధికారులు సస్పెండ్‌..
  • ముగ్గురికి ఛార్జ్‌మెమోలతో సిబ్బందిలో వణుకు..
  • రూ.50కోట్ల భూ మాయ వెనక వైసీపీ నేతలున్నారన్న ఆరోపణలు..
  • వైసీపీ హయాంలో ఎన్వోసీ కోసం రూ.40 లక్షలు చేతులు మారాయా?..
Otr Tadipatri Land Case

Otr Tadipatri Land Case

Off The Record: రాజకీయ నాయకులకు ఐదేళ్లే పదవి. అదే అధికారులకైతే 60ఏళ్ల వరకు పవర్‌ ఉంటుంది. నేతలు చెప్పే రోటీన్ డైలాగ్ ఇది. అయితే ఐదేళ్ల పదవి వాళ్లు 60ఏళ్ల పవర్‌ ఉన్నవాళ్ల మీద పెత్తనం చేయడం పరిపాలనా వ్యవహారం. ఈ క్రమంలో… కొందరు ఆఫీసర్స్‌…. అత్యుత్సాహంతో అధికారంలో ఉన్న వాళ్ళకు భజనతోపాటు వాళ్ళు చెప్పిన అడ్డగోలు పనులు చేయడం, ఆనక ఇరుక్కుపోవడం కూడా సర్వ సాధారణమైపోయింది. దాని పర్యావసనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రి అధికారులు చూస్తున్నారు. భూ అక్రమాలకు సంబంధించి ఇటీవల అనంతపురం జిల్లా కలెక్టర్‌కు ఒక ఫిర్యాదు వచ్చింది. తాడిపత్రి పట్టణం గన్నేవారిపల్లి కాలనీలో 2.4 ఎకరాల భూమి 22ఏ నిషేధిత జాబితాలో ఉంది. దీని విలువ 50 కోట్ల పైమాటే. ఇదే భూమిని కొందరు అక్రమంగా కాజేశారన్నది ఫిర్యాదు. దీంతో ఆ ఫైల్స్‌ను పరిశీలించగా.. భూమికి చెందిన ల్యాండ్ సీలింగ్ రిజిస్టర్‌లో కొట్టివేతలు, దిద్దుబాట్లు కనిపించాయి. ఇదే రిజిస్టర్‌లో 17, 18 పేజీలు ఏకంగా మాయమయ్యాయి. 1బీ రిజిస్టర్, అడంగల్‌లో డి. పట్టాగా ఉండటం, రిజిస్ట్రేషన్ పత్రంలో సీలింగ్ ల్యాండ్ ప్రస్తావన లేకపోవడం.. వంటి అవకతవకల్ని తాడిపత్రి మండల రికార్డుల్లో గుర్తించారు.

ఇదే తరహాలో అనంతపురం ఆర్డీఓ కార్యాలయ రికార్డుల్లోనూ జరిగినట్టు తేలింది. దీంతో ఈ అంశాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. తాడిపత్రి మండల ఇన్ఛార్జ్‌ తహసీల్దార్ గా పని చేసిన జి. సోమశేఖర్‌తో పాటు.. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, వీఆర్వో వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ షఫీలను సస్పెండ్ చేశారు. మండల అధికారుల తప్పులను ఆర్డీఓ కార్యాలయం గుర్తించకపోగా.. ఆ ఫైల్స్‌ను ఆమోదించింది. ఇందుకు బాధ్యులుగా ఆర్డీఓ కార్యాలయ అప్పటి ఇన్ఛార్జి డీఏఓ కుళ్లాయప్ప, రాజేంద్రప్రసాద్, కలెక్టరేట్ భూ సంస్కరణల విభాగం జూనియర్ అసిస్టెంట్ పవన్ కుమార్ కు ఛార్జ్‌ మెమోలు ఇచ్చారు. నలుగురిని సస్పండ్‌ చేయడం, మరో ముగ్గురికి ఛార్జ్ మెమోలతో జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో వణుకు మొదలైంది. అదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తోంది. తప్పు చేసింది వీళ్ళయితే… చేయించింది ఎవరన్న ప్రశ్న వచ్చింది. రికార్డులు తారుమారైన భూములేవీ ఈ ఏడుగురిలో ఎవ్వరి పేరుతో రిజిస్టర్‌ అవలేదు. మరి వెనకున్నది ఎవరని అంటే… వైసీపీ నేతల పేర్లు బయటికి వస్తున్నాయి. 50కోట్లు విలువ చేసే ఈ భూమి గతంలో రెడ్డివారిపల్లి గోపాల్ రెడ్డికి చెందినది. తర్వాత ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం చేతులు మారింది. అలా చాలా మార్పులే జరిగాయి. ఈ క్రమంలో వీఆర్వోగా పనిచేసిన వెంకటరామిరెడ్డి గతంలో దీన్ని కొన్నారు. ఆ రిటైర్డ్ అధికారి నుంచి వైసీపీ నేత రమేష్ రెడ్డి కొన్నారని సమాచారం.

ఇదంతా… తాడిపత్రికి చెందిన వైసిపి నాయకుడు రమేష్ రెడ్డి కనుసనల్లోనే నడిచిందని, నిషేధిత భూమికి ఎన్ఓసీ కోసం ఏకంగా 40 లక్షల రూపాయలు చేతులు మారాయని టిడిపి మాజీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.. వైసిపి నేతపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో ఎన్వోసీ ప్రక్రియను పూర్తి చేయించి, తన భార్య పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ప్రాథమికంగా తేలింది. సదరు వైసీపీ నాయకుడికి సన్నిహితంగా ఉన్న ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారా ఎన్ఓసీ కోసం లక్షల రూపాయలు అధికారులకు ఇచ్చి మ్యానేజ్ చేసినట్టు తేలింది. ఇటీవల ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఫిర్యాదు రూపంలో ఇది ఆయన దృష్టికి వచ్చింది. దీంతో ఆయన సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్‌ను కోరగా…. తీగ లాగితే డొంక కదిలిందని అంటున్నారు. విషయం ఎలా బయటకొచ్చినా అక్రమాలు జరిగిన మాట వాస్తవమనేది ఇన్నాళ్ళకు తేల్చిన అధికారులు చర్యలు తీసుకున్నారు. డబ్బు కక్కుర్తితోనో, అధికారంలో ఉన్నవాళ్ళు చెప్పారనో… రూల్స్‌ పట్టించుకోకుంటే… అధికారులు ఏదో ఒక రోజు ఇలాగే ఇరుక్కుపోతారన్న సంగతి మరోసారి రుజువైందంటున్నారు పరిశీలకులు.