OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!

Odalarevu Fishermens

Odalarevu Fishermens

సముద్రంలో వేటకు వెళ్లి 23 రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా స్వగ్రామాల బాట పట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని దిఘా తీరానికి సురక్షితంగా చేరుకున్న మత్స్యకారులను అధికారులు స్వస్థలాలకు తరలించే క్రమంలో కాకినాడకు తీసుకువచ్చారు. కాకినాడ నుంచి వారు అమలాపురంకు బయలుదేరనున్నారు. మరికొన్ని క్షణాల్లో ఓడలరేవుకు చేరుకోనున్నారు.

కాకినాడ చేరుకున్న మత్స్యకారులకు ఎమ్మెల్సీ రాజశేఖరం అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కొండబాబు కూడా మత్స్యకారులను కలిసి వారి క్షేమ సమాచారాలు అడిగారు. ఇన్ని రోజుల పాటు సముద్రంలో చిక్కుకుపోయినా క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 3న ఓడలరేవు నుంచి ఏడుగురు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. సుమారు 20 మైళ్లు సముద్రంలోకి వెళ్లిన తర్వాత చేపల వేట ప్రారంభించేందుకు ప్రయత్నించగా.. బోటు ఇంజిన్ గేర్‌బాక్స్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఇంజిన్ పనిచేయకపోవడంతో బోటు అదుపు తప్పి సముద్ర ప్రవాహం, గాలుల కారణంగా దూరంగా కొట్టుకుపోయింది.

ఇంజిన్ పనిచేయకపోవడంతో తాము సుమారు 280 మైళ్ల మేర సముద్రంలోకి కొట్టుకుపోయినట్లు మత్స్యకారులు తెలిపారు. ఈ క్రమంలో తుఫాను పరిస్థితులు ఎదురవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని చెప్పారు. చుట్టూ చీకటి మాత్రమే కనిపించేదని, ఎక్కడా ఇతర బోట్లు లేదా మనుషులు కనిపించలేదని తమ అనుభవాలను వివరించారు. ఇంజిన్ పనిచేయకపోవడంతో తెరచాప ఏర్పాటు చేసుకుని గాలికి అనుగుణంగా బోటును నడుపుకుంటూ వెళ్లినట్లు మత్స్యకారులు తెలిపారు. ఆ సమయంలో తమకు ఎలాంటి సహాయం అందుబాటులో లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు.

సముద్రంలో 23 రోజుల పాటు అనేక కష్టాలు అనుభవించామని మత్స్యకారులు తెలిపారు. తుఫాను సమయంలో తీవ్ర భయానికి గురయ్యామని, చుట్టూ ఎవరూ కనిపించకపోవడంతో తమ పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందామని చెప్పారు. ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్ తీరం కనిపించడంతో తమకు ప్రాణం వచ్చినట్లయిందని తెలిపారు. 23 రోజుల అనంతరం దిఘా తీరానికి చేరుకున్న మత్స్యకారులకు అక్కడి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని నిర్ధారించారు. అనంతరం వారిని స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతం కాకినాడకు చేరుకున్న ఏడుగురు మత్స్యకారులు అమలాపురం మీదుగా ఓడలరేవుకు వెళ్లారు.