భారతదేశ బంగారు మార్కెట్ ఇప్పుడు డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టింది. మే 4, 2026న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGRs)ను ప్రారంభించింది. EGRలు అనేవి సెబీ గుర్తింపు పొందిన వాల్ట్లలో భద్రపరిచిన భౌతిక బంగారానికి ప్రాతినిధ్యం వహించే డిజిటల్ సెక్యూరిటీలు. సులభంగా చెప్పాలంటే.. మీరు బంగారాన్ని మీ ఇంట్లో లేదా లాకర్లో ఉంచుకోకుండా, షేర్ల లాగే డీమ్యాట్ ఖాతాలో ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకోవచ్చు. ప్రతి EGR వెనుక అసలైన బంగారం ఉంటుంది, కాబట్టి పెట్టుబడిదారులు బంగారంపై పూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉంటారు.
ఇది ఎలా పనిచేస్తుంది?
1,000 గ్రాముల బంగారు కడ్డీని NSE ఎలక్ట్రానిక్ రసీదుగా (EGR) మార్చి చూపింది. పెట్టుబడిదారులు వీటిని స్టాక్ మార్కెట్లో షేర్ల మాదిరిగానే కొనవచ్చు లేదా అమ్మవచ్చు. అవసరమైతే ఈ ఎలక్ట్రానిక్ రసీదులను తిరిగి భౌతిక బంగారంగా మార్చుకునే సదుపాయం కూడా ఉంది.
దీనివల్ల ఉపయోగాలు ఏంటి..?
భారతదేశంలో బంగారం మార్కెట్ చాలా పెద్దది అయినప్పటికీ, అది ఎక్కువగా అసంఘటితంగా ఉంది. EGRల వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే.. బంగారం ధరలు మరింత స్పష్టంగా, అధికారికంగా తెలుస్తాయి. బంగారాన్ని భౌతికంగా దాచుకోవాల్సిన అవసరం, దొంగతనాల భయం ఉండదు. తక్కువ మొత్తంలో కూడా బంగారంపై పెట్టుబడి పెట్టడం సులభతరం అవుతుంది. వీటిని ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ పద్ధతిలో అమ్ముకోవచ్చు కాబట్టి నగదుగా మార్చుకోవడం సులభం. ఈ కొత్త విధానం వల్ల జ్యువెలర్లు, వ్యాపారులు , సాధారణ పెట్టుబడిదారులకు బంగారంపై పెట్టుబడి పెట్టడం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతుంది.
