గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, ప్రజల్లో ఇంధన కొరతపై రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ పరంగా సప్లైలో అంతరాయాల నేపథ్యంలో భారత్లో కూడా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందేమోనన్న భయం వాహనదారులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్’(IOCL) కీలక ప్రకటన చేసింది.
Also Read:LPG Crisis: గ్యాస్, పెట్రోల్ కొరతపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన..
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత అస్సలు లేదని ఇండియన్ ఆయిల్ స్పష్టం చేసింది. దేశంలోని అన్ని ఇండియన్ ఆయిల్ బంకులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, వినియోగదారుల అవసరాలకు సరిపడా నిల్వలు నిరంతరం అందుబాటులో ఉంచుతున్నామని తెలిపింది. ‘ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధన సరఫరా జరుగుతోంది. వాహనదారులు పానిక్ బయింగ్ (అవసరానికి మించి కొనుగోలు చేయడం) చేయాల్సిన అవసరం లేదు’ అని సంస్థ ప్రతినిధులు భరోసా ఇచ్చారు.
Also Read:House Tax: ఏందయ్యా ఇది.. ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లిన మున్సిపల్ సిబ్బంది..
నిజానికి.. వంట గ్యాస్ (LPG) ధరల పెరుగుదల, కొన్ని చోట్ల కనిపిస్తున్న కొరత వల్ల వాహనదారులు పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా ఆందోళన చెందారు. అయితే.. పెట్రోలియం శాఖ గణాంకాల ప్రకారం.. భారత్ వద్ద అత్యవసర పరిస్థితుల కోసం తగినంత క్రూడ్ ఆయిల్ రిజర్వ్లు ఉన్నాయి. రష్యా వంటి దేశాల నుంచి ముడి చమురు దిగుమతులు కొనసాగుతుండటం వల్ల ప్రస్తుతానికి ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. వదంతులను నమ్మి పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కట్టి ఇబ్బంది పడవద్దని ప్రభుత్వం, చమురు సంస్థలు కోరుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల విషయంలో ఉన్న కొన్ని ఇబ్బందులు ఇంధన సరఫరాపై ప్రభావం చూపవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
