TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..

Kavitha1

Kavitha1

నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు ఇతర పార్టీలకు స్వస్తి పలికి, తెలంగాణ రాష్ట్ర సేన (TRS) జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోరాట పటిమ, ఆమె నాయకత్వంపై ఉన్న నమ్మకమే ఈ భారీ చేరికలకు ప్రధాన కారణమని యువత స్పష్టం చేసింది.

కామారెడ్డి గడ్డపై తెలంగాణ రాష్ట్ర సేన జెండాను మరింత పటిష్టం చేసే దిశగా సంపత్ గౌడ్ వేస్తున్న అడుగులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి బలమైన కేడర్ కలిగిన యువత టీఆర్ఎస్ వైపు మళ్లడం, రాబోయే ఎన్నికల సమీకరణాలను మార్చివేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పోకల సాయిరాం, జిల్లా కార్యదర్శి ప్రతాప్ రెడ్డి మరియు ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు పాల్గొని కొత్తగా చేరిన వారికి సాదర స్వాగతం పలికారు. ఈ చేరికతో లింగంపేట మండలంలో టీఆర్ఎస్ మరింత బలపడింది.