Nikita Porwal is Miss India 2024: ‘ఫెమినా మిస్ ఇండియా’ 2024 కిరీటాన్ని నిఖిత పోర్వాల్ సొంతం చేసుకున్నారు. బుధవారం రాత్రి ముంబైలోని ఫేమస్ స్టూడియోస్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో మధ్యప్రదేశ్కు చెందిన నిఖిత విజయం సాధించారు. ఆమెకు గతేడాది విజేత నందిని గుప్తా కిరీటాన్ని అందజేయాగా.. నేహా ధూపియా మిస్ ఇండియా సాష్ను అందించారు. ఇక మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్ తరఫున నిఖిత ప్రాతినిధ్యం వహించనున్నారు.
మిస్ ఇండియా 2024 మొదటి రన్నరప్గా రేఖా పాండే, ఆయుశీ దోలకియా రెండవ రన్నరప్గా నిలిచారు. ఈ గ్రాండ్ ఫినాలేకు మాజీ మిస్ ఇండియా సంగీతా బిజ్లానీ హాజరయ్యారు. 60వ ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు పోటీపడ్డారు. తమ అందాలతోనే కాదు, ప్రతిభతోనూ జడ్జిల నుంచి వారు ప్రశంసలు అందుకున్నారు. అనేక రౌండ్ల తరువాత తుది పోరులో అదరగొట్టిన నిఖిత కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
Also Read: IND vs NZ: బెంబేలెత్తిపోయిన బ్యాటర్లు.. భారత్ స్కోరు 34/6! నలుగురు డకౌట్
టైటిల్ గెలిచిన తర్వాత నిఖిత పోర్వాల్ తన సంతోషంను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఈ ఆనందాన్ని నేను వర్ణించలేను. నాకు మాటలు రావడం లేదు. ఈ విజయంను నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నా తల్లిదండ్రుల కళ్లలోని ఆనందం చూసి నాకు గర్వంగా ఉంది. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది’ అని నిఖిత పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో కూడా నిఖిత విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.