NTV Telugu Site icon

ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో నమోదైన అత్యంత భారీ స్కోర్లు ఇవే

Icc Champions Trophy

Icc Champions Trophy

ICC Champions Trophy: లాహోర్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు సౌతాఫ్రికా జట్టుపై 362/6 పరుగుల భారీ స్కోరు సాధించి రికార్డు సృష్టించింది. నేడు (2025 మార్చి 5)న జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెన్సేషన్ సెంచరీలతో మెరుపులు మెరిపించారు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (49*) రాణించడంతో న్యూజిలాండ్ జట్టు అత్యధిక స్కోరును నమోదు చేయగలిగింది. మరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో (ICC Champions Trophy) ఇప్పటివరకు నమోదైన అత్యంత భారీ స్కోర్లపై ఒక లుక్ వేద్దామా..

Read Also: NZ vs SA Semifinal: రచిన్ రవీంద్ర, విలియమ్సన్ సెంచరీలు.. భారీ స్కోర్ చేసిన న్యూజిలాండ్

ఇక ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు కూడా ఇదే టోర్నమెంట్‌లో నమోదైంది. ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌పై 356/5 పరుగులు చేయడంతో ఇది రెండవ స్థానంలో నిలిచింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 351/8 పరుగులు చేసి మూడవ స్థానంలో నిలిచింది. 2004 సెప్టెంబర్ 10న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు అమెరికా జట్టుపై 347/4 పరుగులు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. అదే విధంగా 2017 జూన్ 18న పాకిస్థాన్ జట్టు భారత జట్టుపై 338/4 పరుగులు చేసి ఐదవ స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత 2013 జూన్ 6న కార్డిఫ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 331/7 పరుగులు చేయగా, 2025 ఫిబ్రవరి 26న లాహోర్‌లో ఇంగ్లాండ్‌పై ఆఫ్గానిస్తాన్ జట్టు 325/7 పరుగులు చేసి అత్యధిక స్కోర్ల జాబితాలో చోటు సంపాదించాయి. అలాగే 2009 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాపై సెంటూరియన్‌లో 323/8 పరుగులు చేయగా, 2017 జూన్ 8న శ్రీలంక జట్టు భారత జట్టుపై 322/3 పరుగులతో విజయం సాధించింది. అదే మ్యాచ్‌లో భారత్ జట్టు శ్రీలంకపై 321/6 పరుగులు చేసినప్పటికీ ఆ మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమి పాలైంది.