Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..

Nethanna

Nethanna

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబు నాయుడి లక్ష్యమని, అందులో భాగంగా ‘నూతన నేతన్న భరోసా పెన్షన్’ దరఖాస్తు విధానంలో ఒక కీలక నిబంధనను సడలించినట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే చేనేత కార్మికులు తమ బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మాస్టర్ వీవర్ ధ్రువీకరణ పత్రం, తమ వేతన వివరాలను అందజేస్తే సరిపోతుంది. ఈ నిబంధన సడలింపుతో 50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ సులభంగా పెన్షన్లు అందే మార్గం సుగమమైంది. అందువల్ల అర్హులైన కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది.

ఇలా నేతన్నలకు ఊరటనిస్తూనే, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబానికి సామాజిక భ‌ద్రత, ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్’ పథకం కింద కొత్త దరఖాస్తుల నమోదును వేగవంతం చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల ద్వారా కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా 6,81,501 దరఖాస్తులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు నమోదైన దరఖాస్తుల వివరాలను కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా వృద్ధాప్య పింఛన్ కోసం 3,76,019 మంది దరఖాస్తు చేసుకోగా, వితంతు పింఛన్ కోసం 1,65,201 మంది, దివ్యాంగుల పింఛన్ కోసం 1,09,595 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే కల్లుగీత కార్మికుల నుంచి 7,005, మత్స్యకారుల నుంచి 6,268, డప్పు కళాకారుల నుంచి 5,565, సంప్రదాయ చెప్పుల తయారీదారుల నుంచి 4,981, నిబంధనలు సడలించబడిన చేనేత కార్మికుల నుంచి 4,932, ఒంటరి మహిళల నుంచి 1,633, మరియు ట్రాన్స్‌జెండర్ల నుంచి 342 దరఖాస్తులు వచ్చాయి. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియకు సెప్టెంబర్ 16 వరకు గడువు నిర్ణయించారు. ఈ దరఖాస్తు గడువును మరింత పెంచే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.