Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..

  • భోటేకోషి వరదలు, కొండచరియలతో నేపాల్–టిబెట్ సరిహద్దులో భారీ విధ్వంసం
  • సుమారు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు చైనా ప్రకటన
  • గల్లంతైన వారిలో పర్యాటకులు, యాత్రికులు ఉన్నట్లు వెల్లడి
Nepal Floods

Nepal Floods

Nepal Floods:  నేపాల్ జల ప్రళయం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భోటేకోషి నది ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఈ విపత్తులో సుమారు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్లంతైన వారిలో పర్యాటకులు, యాత్రికులు, ఇతరులు ఉన్నట్లు చెప్పింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వివరాలను వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ వరదల్లో టిబెట్ లోని గిరాంగ్ కౌంటీ తీవ్రంగా దెబ్బతింది. చైనా సైన్యానికి చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ సహాయక చర్యల్లో పాల్గొంటోంది.

చైనాకు తీవ్ర నష్టం..

కొండచరియలు విరిగి పడటం, వరదలు చైనాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నేపాల్-చైనా ప్రధాన భూమార్గం తీవ్రంగా దెబ్బతింది. భవనాలు బురదతో నిండిపోయాయి. కార్లు, బస్సులు కొట్టుకుపోయాయి. నేపాల్-చైనా సరిహద్దులో ఉన్న ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదకర ప్రాంతాల్లోని సమీప గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు.

టిబెట్ లోని గిరాంగ్ సరిహద్దు పోర్టు వద్ద కొండచరియలు విరిగిపడటంతో భారీ నష్టం సంభవించిన నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహాయకచర్యల్ని వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు పూర్తిస్థాయిలో గాలింపు చేపట్టాలని, చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, గాయపడిన వారికి వెంటనే వైద్యం అందించాలని ఆయన సూచించారు.