AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఏపీ, తెలంగాణ) వీఎం.రెడ్డి (ఎయిర్ కమోడోర్) కలిశారు. విపత్తు నిర్వహణలో ఎన్సీసీ క్యాడెట్ల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. అంతేకాక ఏపీలో ఎన్సీసీ విస్తరణ ప్రణాళికపై కూడా సమావేశంలో చర్చించారు. అదనంగా 60 వేల మంది ఎన్సీసీ క్యాడెట్లను రిక్రూట్ చేయడం ద్వారా ప్రతి జిల్లాలో ఎన్సీసీ క్యాడెట్లు అందుబాటులో ఉంటారని ముఖ్యమంత్రికి ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీఎం రెడ్డి వివరించారు.
Also Read: Minister Satyavathi: వరద నష్టాలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం
ఏపీ విద్యార్ధులకు సమర్ధవంతమైన శిక్షణను అందించేందుకు వీలుగా ఏపీలో సెంట్రల్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది. ఎన్సీసీకి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్ క్యాడెట్ల శిక్షణ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలతో కూడిన భూమిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు ఎన్సీసీ ఉన్నతాధికారులకు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్సీసీ అసిస్టెంట్ డైరెక్టర్ కల్నల్ సంజయ్ గుప్తా, గ్రూప్ కమాండర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.