Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్‌లో మంటలు..

Nampally Railway Stationsss

Nampally Railway Stationsss

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లో నిలిపి ఉంచిన జైపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (హైదరాబాద్ – జైపూర్) రైలుకు చెందిన ఏసీ కోచ్‌లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో స్టేషన్‌లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలులోని బి-1 , బి-2 , బి-3 ఏసీ కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నాయి.

రైలు ప్లాట్‌ఫామ్‌పై నిలిచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు, ప్లాట్‌ఫామ్‌పై ఉన్నవారు వెంటనే స్పందించారు. అప్రమత్తమైన వారు బోగీల అద్దాలను పగలగొట్టి, లోపల ఉన్న ప్రయాణికులను అత్యంత సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో బోగీల్లో ప్రయాణికులు తక్కువ సంఖ్యలో ఉండటం, వెంటనే ఖాళీ చేయించడంతో ఒక పెద్ద ప్రాణనష్టం తప్పింది.

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు, స్థానిక ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటన స్థలానికి 3 ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఫైర్ సిబ్బంది, రైల్వే సిబ్బంది ఉమ్మడిగా పోరాడి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. దీంతో మంటలు పక్కన ఉన్న ఇతర బోగీలకు, ప్లాట్‌ఫామ్‌కు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఏసీ కోచ్‌లలో ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే.. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ప్రమాదం కారణంగా నాంపల్లి స్టేషన్‌లో కొంతసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.