Site icon NTV Telugu

Suspended: ఆ పని చేసినందుకు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై వేటు.. సస్పెండ్ చేసిన కలెక్టర్..

Inter Education Department Ad Suspended

Inter Education Department Ad Suspended

నాగర్‌కర్నూల్ జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించని ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు..

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) గ్రాంట్ల వినియోగంలో తీవ్రమైన లోపాలు జరిగినట్లు కలెక్టర్ గుర్తించారు. పంచాయతీ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను వినియోగించేటప్పుడు ఈ-గ్రామ్ స్వరాజ్ (e-Gram Swaraj) పోర్టల్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే.. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి.. నిధులను ఇష్టారాజ్యంగా దారిమళ్లించడమే కాకుండా.. రికార్డుల నిర్వహణలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించారు.

సస్పెన్షన్‌కు గురైన వారు వీరే..

బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కింది అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. అందులో పి. కిషన్ ఒకరు. వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీ (గ్రేడ్-IV కార్యదర్శి)కి కార్యదర్శిగా పని చేస్తు్న్నారు. కొల్లాపూర్ మండలం, సింగోటం గ్రామపంచాయతీలో గ్రేడ్-III కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న పి. అర్జునయ్యపై కూడా వేటు పడింది. కొల్లాపూర్ మండలం, అంకిరావుపల్లి గ్రామపంచాయతీలో గ్రేడ్-III కార్యదర్శిగా పని చేస్తున్న ఆర్. ప్రేమచంద్ కూడా సస్పెన్షన్ కు గురయ్యారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వీరికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులు, ప్రాథమిక విచారణ నివేదికల ఆధారంగా కలెక్టర్ మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం కార్యదర్శుల మీదనే కాకుండా, వారి పనితీరును పర్యవేక్షించడంలో విఫలమైన మండల స్థాయి అధికారులపై కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగూరు, కొల్లాపూర్ మండలాల మండల పంచాయతీ అధికారులకు (MPOs) షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయి, నిధులు సక్రమంగా వినియోగించబడుతున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత మీపై లేదా అని ఆయన ప్రశ్నించారు.

కలెక్టర్ హెచ్చరిక..

ప్రభుత్వ నిధులు ప్రజల ప్రయోజనాల కోసమే వినియోగించాలని, ఎక్కడైనా అవినీతి లేదా నిబంధనల ఉల్లంఘన జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. ప్రతి పైసాకు జవాబుదారీతనం ఉండాలని, ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో అజాగ్రత్తగా ఉండే ఏ అధికారికైనా ఇదే గతి పడుతుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేశారు.

Exit mobile version