MS Dhoni: “మిస్టర్ కూల్”కి అంత కోపం వచ్చిందా.. మ్యాచ్ ఓడిపోవడంతో టీవీ పగలగొట్టాడా.?

Image (2)

Image (2)

MS Dhoni: ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లు ముగియడంతో ప్లేఆఫ్స్ స్థానాలు భర్తీ అయ్యాయి. ఇది ఇలా ఉండగా తాజాగా మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఓ డ్రెస్సింగ్ రూమ్ ఘటనను హర్భజన్ బయటపెట్టడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

స్పోర్ట్స్ యారీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన హర్భజన్ సింగ్.. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన కీలక మ్యాచ్ తర్వాత ఈ ఘటన జరిగిందని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంతో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ సహా ఆర్సీబీ ఆటగాళ్లు మైదానంలో భారీగా సంబరాలు చేసుకున్నారని పేర్కొన్నాడు. అదే సమయంలో సీఎస్‌కే ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం సంప్రదాయంగా జరిగే హ్యాండ్‌షేక్ కోసం లైన్లో నిలబడి ఉన్నారని హర్భజన్ తెలిపాడు. అయితే ఆర్సీబీ ఆటగాళ్ల సెలబ్రేషన్స్ ఎక్కువసేపు కొనసాగడంతో సీఎస్‌కే శిబిరంలో అసహనం పెరిగిందని తెలిపాడు.

ఈ విషయమై హర్భజన్ కథనం ప్రకారం.. ఆ సమయంలో ధోనీ ఎక్కువసేపు వేచి ఉండకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయాడని.. ఆ సమయంలో ఓటమి బాధతో ఉన్న ధోనీ, డ్రెస్సింగ్ రూమ్ బయట ఉన్న టెలివిజన్ స్క్రీన్‌ను కోపంతో కొట్టాడని హర్భజన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే “కెప్టెన్ కూల్” ధోనీ నిజంగానే కోపంతో టీవీ పగలగొట్టాడా? అనే చర్చ మొదలైంది. ధోనీ లాంటి ప్రశాంత స్వభావం ఉన్న ఆటగాడు ఇలా ప్రవర్తించాడంటే నమ్మలేకపోతున్నామని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తుండగా.. మరోవైపు కీలక మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత ఎంత పెద్ద ఆటగాడికైనా భావోద్వేగాలు సహజమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్‌కే మరోసారి ప్లేఆఫ్స్ చేరకపోవడంకూడా అభిమానులను వెంటాడుతుండటంతో ఈ అంశం మరింత వైరల్‌గా మారింది. అయితే హర్భజన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ధోనీ లేదా సీఎస్‌కే మేనేజ్మెంట్ ఇప్పటివరకు ఈ విషయంపై ఎక్కడా స్పందించలేదు. అయినా ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చర్చకు దారి తీసింది.