Meghalaya: భర్త ముఖ్యమంత్రి.. భార్య ఎమ్మెల్యే.. వ్యక్తిగత బంధాలు వదిలేసి ఇద్దరూ అసెంబ్లీలో సమస్యలపై చర్చిస్తే ఎలా ఉంటుంది? అచ్చం అలాంటి ఘటనే తాజాగా మేఘాలయ అసెంబ్లీలో చోటు చేసుకుంది. అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే మెహతాబ్ చండీ అగిటోక్ సంగ్మా (Mehtab Chandee A Sangma), ముఖ్యమంత్రి కాన్రాడ్ కొంగల్ సంగ్మా (Conrad K Sangma) భార్యాభర్తలు. తాజాగా భార్య మెహతాబ్ చండీ పశుసంవర్ధక విద్యాసంస్థల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రిని వివరణ కోరారు. ఓ వైపు కుటుంబ సంబంధాలను పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ ఘటన సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2022లో కేబినెట్ ఆమోదించిన వెటర్నరీ కాలేజ్, రెండు ఫిషరీస్ కాలేజీలు, ఒక డెయిరీ కాలేజ్ పురోగతి ఏ దశలో ఉందని గాంబెగ్రే నియోజకవర్గ ఎమ్మెల్యే మెహతాబ్ ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలోని వెటర్నరీ ట్రైనింగ్ సెంటర్లలో సిబ్బంది కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. పశుసంవర్ధక రంగంపై ఆధారపడి జీవనం సాగించే ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ విద్యాసంస్థలు అత్యవసరమని స్పష్టం చేశారు.
READ MORE: Theater vs OTT : ఓటీటీ 8 వారాల నిబంధన అమలు సాధ్యమేనా? బాలీవుడ్ రూల్ ఇక్కడ వర్తిస్తుందా?
ప్రభుత్వ తరఫున భర్త, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమాధానం ఇచ్చారు. పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సిబ్బంది కొరత నిజంగా ఆందోళనకర అంశమేనని అంగీకరిస్తూ, ఖాళీలను త్వరగా భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నియామకాలను ప్రాధాన్యంగా తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్) సిద్ధం కావడంలో ఆలస్యం జరిగిన విషయాన్ని సీఎం వివరించారు. భూమి గుర్తింపు, అవసరమైన సిబ్బంది అంచనా వంటి అంశాలు సమయం తీసుకున్నాయని చెప్పారు. రి-భోయ్ జిల్లాలోని కిర్డెంకులై వద్ద వెటర్నరీ కాలేజీ కోసం సుమారు 800 ఎకరాల భూమిని గుర్తించామని, దాని అంచనా వ్యయం రూ.334 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఇందులో 19 విభాగాలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. అయితే భారీ ఆర్థిక వ్యయం అవసరమవుతుండటంతో కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రాజెక్టును వేగవంతం చేసే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సభకు హామీ ఇచ్చారు. ఈ చర్చ కాస్త అసెంబ్లీలో ఎంతో ఆసక్తిగా కొనసాగింది.
READ MORE: Sachin-Sehwag-Ganguly: సచిన్–సెహ్వాగ్ ప్రాంక్.. టాయిలెట్లో ఉన్న గంగూలీ బలి!
