Meerut Snake Murder: అది మీరట్లోని హస్తినాపూర్ పరిధి. ఒక ఇంట్లో యువకుడు పాము కాటుకు గురై చనిపోయాడు. మంచం మీద విషసర్పం కనిపించింది. భర్త శవాన్ని పట్టుకుని భార్య రోదిస్తోంది. కుటుంబం అంతా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. మొదటి చూపులో ఎవరికైనా ఇది కేవలం ఒక విషాదకరమైన ప్రమాదం అనే అనిపిస్తుంది. కానీ, పోలీసులు రంగంలోకి దిగిన కొద్ది గంటల్లోనే కథ మొత్తం అడ్డం తిరిగింది. అది ప్రమాదం కాదు.. అతి కిరాతకంగా స్కెచ్ వేసి చేసిన పక్కా ప్లాన్డ్ మర్డర్ అని తేలింది.
ఆ రాత్రి అసలు ఏం జరిగిందంటే..
మృతుడు అతుల్ పన్వార్, అతని భార్య దామిని ఆరేళ్ల క్రితం (2019) ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఒక పబ్లిక్ స్కూల్ నడుపుతున్నారు. అయితే, అదే స్కూల్లో డ్రైవర్గా పనిచేసే తుషార్ అలియాస్ నిక్కీతో దామినికి ఏర్పడిన వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి దారితీసింది. అతుల్ను ఎలాగైనా వదిలించుకుని, అతని పేరిట ఉన్న రూ. 20 లక్షల బీమా (ఇన్సూరెన్స్) సొమ్మును కొట్టేయాలని వీరిద్దరూ పథకం వేశారు. ఇందుకోసం సోనూ, ఉదయ్ అనే మరో ఇద్దరు వ్యక్తులకు ఐదు లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.
పథకం ప్రకారం, గురువారం రాత్రి దామిని తన భర్త అతుల్కు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతుల్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇక, డ్రైవర్ తుషార్ తన ఇద్దరు అనుచరులతో కలిసి ముందే తెచ్చి పెట్టుకున్న ఒక విషసర్పంతో అక్కడికి చేరుకున్నాడు. ఆ పామును అతుల్ పడుకున్న మంచం మీద, దుప్పటి లోపల వదిలేశారు. గాఢ నిద్రలో ఉండటం వల్ల అతుల్ కదలలేకపోయాడు. పాము కాటు వేయడంతో రాత్రికే ప్రాణాలు కోల్పోయాడు. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్టు దామిని తన భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
పోలీసుల అనుమానం.. కాల్ డేటా విశ్లేషణ:
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ పాము దొరికినప్పటికీ, కొన్ని పరిస్థితులు సాధారణంగా అనిపించలేదు. పాము మంచం లోపలికి ఎలా వచ్చిందనే అనుమానం వచ్చింది. దీంతో పోలీస్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటగా భార్య దామిని మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డులను (CDR) పరిశీలించగా, ఆమె డ్రైవర్ తుషార్తో నిరంతరం టచ్లో ఉన్నట్లు డిజిటల్ ఆధారాలు లభించాయి. వెంటనే తుషార్ను అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం ఒప్పేసుకున్నాడు. ఈ క్రమంలో తుషార్ మొబైల్ ఫోన్ను తనిఖీ చేసిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే ఒక తిరుగులేని ఆధారం దొరికింది. ఒక డబ్బాలో బంధించి ఉన్న పాము ఫోటో అతని మొబైల్లో ఉంది. ఇద్దరు పాములు పట్టేవాళ్ల దగ్గర నుంచి తానే ఆ విషసర్ప కొనుగోలు చేసినట్లు తుషార్ అంగీకరించాడు. ఈ ఒక్క డిజిటల్ ఫోటోనే కేసులో అత్యంత కీలక సాక్ష్యంగా మారింది.
ఇదే మొదటి ప్రయత్నం కాదు!
పోలీసుల విచారణలో మరో షాకింగ్ నిజం బయటపడింది. అతుల్ను చంపడానికి వీరు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా 20 రోజుల క్రితం, ఒక ఎర్టిగా కార్తో అతుల్ను ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించాలని తుషార్ ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో అతుల్ హెల్మెట్ ధరించి ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఘటనపై అతుల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు, దామినినే అతనికి నచ్చజెప్పి ఆపేసింది. ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతోనే ఈ ‘స్నేక్ మర్డర్’ స్కెచ్ వేశారు.

