Maoist leaders surrender: మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉండి పార్టీ కార్యకలాపాలను నడిపించిన నలుగురు అత్యంత సీనియర్ నాయకులు పోలీసుల ముందు లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ సమక్షంలో ఈ లొంగుబాటు కార్యక్రమం జరిగింది. పొలిట్ బ్యూరో సభ్యుడు (PBM) తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజి అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM) మల్లారాజి రెడ్డి అలియాస్ రంగారం, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు (SCM) నూనె నరసింహా రెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ రన్నా దాదా అధికారికంగా లొంగిపోయారు.
ఈ అగ్ర నేతలు గత 40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో ఉండి మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను నిర్వహించారు. వీరి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన అగ్రనేతలు లొంగిపోవడంతో రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని పోలీసులు ప్రకటించారు.
మినీ LED, 108W సౌండ్, Quantum డాట్ టెక్నాలజీతో Kodak 65 అంగుళాల IconiK Google TV భారత్లో లాంచ్..!
తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజి 1982లో CPI (ML) ప్యూపిల్స్ వార్ లో చేరి దండకారణ్య ప్రాంతంలో ఆయుధ దళ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. 1984 నుంచి 1989 వరకు సిరోంచా, పెరిమిలి ప్రాంతాల్లో దళ కమాండర్గా పనిచేశారు. అనంతరం 1989లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2001లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. 2017లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్చార్జ్గా పనిచేసి, తరువాత పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.
మల్లారాజి రెడ్డి అలియాస్ రంగారం 1970లలో ఉద్యమంలో చేరి 1980లలో రాష్ట్ర కమిటీ స్థాయికి ఎదిగారు. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. మహారాష్ట్ర, దండకారణ్య ప్రాంతాల్లో ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. 2007లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసి, ఛత్తీస్గఢ్–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక జోనల్ కమిటీ ఇన్చార్జ్గా కీలక పాత్ర పోషించారు. ఇంకా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ 1996లో విద్యార్థి సంఘం ద్వారా ఉద్యమంలో చేరి, ఏటూరునాగారం, మహాదేవపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. తరువాత తెలంగాణ రాష్ట్ర కమిటీలో కార్యదర్శిగా ఎదిగారు. అలాగే రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహా రెడ్డి కూడా పార్టీ కీలక కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
మరోవైపు మావోయిస్టు అగ్రనేత గణపతి అచూకీ కూడా లభించినట్టు సమాచారం. దశాబ్దాల పాటు పార్టీని నడిపించిన గణపతి వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నేపాల్లో ఉన్నట్లు సమాచారం ఉండగా, ఆయనను భారత్కు తీసుకురావడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.