మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామో జిల్లాలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే… శంకర్రాయ్ అనే వ్యక్తి ఇంట్లో లెక్కలేని డబ్బు ఉందంటూ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఇంకమ్ట్యాక్స్ అధికారులు శంకర్రాయ్ నివాసంలో సోదాలు నిర్వహించగా రూ.కోటి విలువైన నోట్ల కట్టలను సంపులో దాచినట్టు తెలుసుకుని అవాక్కయ్యారు. సంపులో దాచిన ఆ నోట్ల కట్టల బ్యాగును బయటకు తీసిన అధికారులు.. తడిసిపోయిన నోట్లను డ్రయ్యర్ తో ఆరబెట్టారు. ఇస్త్రీ కూడా చేశారు.
Also Read: అలాంటి మెసేజ్లతో జాగ్రత్త…ఆదమరిస్తే అంతే!
అధికారులు నిర్వహించిన ఈ దాడుల్లో శంకర్ రాయ్ నుంచి మొత్తం రూ.8 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి దాదాపు 39 గంటల పాటు ఈ సోదాలు జరిగినట్టు జబల్ పూర్ ఐటీ జాయింట్ కమిషనర్ మున్మున్ శర్మ వెల్లడించారు. శంకర్ రాయ్ ఫ్యామిలీ మూడు డజన్లకు పైగా బస్సులను ఉద్యోగుల పేరిట నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. వారి ఆస్తుల గురించి మరింత సమాచారం ఇస్తే రూ.10 వేల నజరానా ఇస్తామని ప్రకటించారు. శంకర్ రాయ్ కాంగ్రెస్ పార్టీ తరఫున దామో నగర పాలిక ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కాగా శంకర్ రాయ్ సోదరుడు కమల్ రాయ్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.
