NTV Telugu Site icon

Suicides: షాకింగ్ న్యూస్.. దేశంలో ప్రతి నాలుగున్నర నిమిషాలకు ఓ పురుషుడు ఆత్మహత్య.. కారణాలు ఇవే..

Suicides

Suicides

భారతదేశంలో పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తాజా నివేదిక పేర్కొంది. ఎన్‌సీఆర్బీ డేటా ప్రకారం.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న పురుషుల సంఖ్య మహిళల కంటే చాలా ఎక్కువ. రెండు దశాబ్దాల గణాంకాలు పరిశీలిస్తే.. భారతదేశంలోని ప్రతి 10 ఆత్మహత్యలలో 6 లేదా 7 మంది పురుషులే ఉన్నారు. ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతున్న మహిళల సంఖ్య 40 నుంచి 48 వేలుగా ఉంది. ఇదే కాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న పురుషుల సంఖ్య 66 వేల నుంచి లక్షకు పైగా పెరిగింది. 2022లో 1.70 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 1.22 లక్షల మంది పురుషులు ఉన్నారు. అంటే సగటున రోజుకు 336 మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని ప్రకారం ప్రతి నాలుగున్నర నిమిషాలకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణాంకాల ప్రకారం పురుషులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ప్రపంచంలోని ప్రతి లక్ష మంది పురుషులలో 12.6 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదే సమయంలో.. ఈ రేటు ప్రతి లక్ష మంది మహిళల్లో 5.4గా ఉంది.

READ MORE: Rice: అన్నం తింటే బరువు పెరుగుతారా.. ఇందులో నిజమెంత..?

ఆత్మహత్యలకు గల కారణాలు..
ఒక్కో వ్యక్తి ఆత్మహత్యకు ఒక్కో కారణం ఉంటుంది. డిప్రెషన్, ఒత్తిడి కారణంగా బలవన్మరణాలకు పాల్పడే ధోరణి పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్నిసార్లు వైద్యపరమైన కారణం కూడా ఉంటుంది. ఇది కాకుండా.. ఒక వ్యక్తి తన సమస్య నుంచి బయటపడటానికి మార్గం లేనప్పుడు.. సూసైడ్ చేసుకునేందుకు యత్నిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో ఆత్మహత్యకు గల కారణాలను కూడా పేర్కొంది. దీని ప్రకారం.. కుటుంబ సమస్యలు, వ్యాధులతో (ఎయిడ్స్, క్యాన్సర్ మొదలైనవి) విసిగిపోయిన వ్యక్తులు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతేడాది కుటుంబ సమస్యల కారణంగా 32%, అనారోగ్యం కారణంగా 19% మంది సూసైడ్ చేసుకున్నారు. అయితే స్త్రీ, పురుషుడు ఆత్మహత్యకు గల కారణాలను అందులో పేర్కొనలేదు.