Mahakaleshwar Temple dispute: ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో బుధవారం ఒక అసహ్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయ గర్భగుడిలో పూజారి మహేష్ శర్మ, నాథ్ శాఖకు చెందిన మహంత్ మహావీర్నాథ్ మధ్య వివాదం చెలరేగింది. దుస్తుల కోడ్, తలపాగాలను తొలగించడంపై ఈ ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. వాగ్వాదం తీవ్రమై ఇద్దరు ఒకరిపై ఒకరు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించే స్థాయి వరకు వెళ్లింది.
READ ALSO: Shilpa Shetty : రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్..
పలు నివేదికల ప్రకారం.. రిణుముక్తేశ్వర్ ఆలయానికి చెందిన మహంత్ మహావీర్నాథ్, గోరఖ్పూర్ నుంచి మహంత్ శంకర్నాథ్ మహారాజ్తో కలిసి బుధవారం ఉదయం 8:15 గంటలకు మహాకల్ ఆలయానికి పూజల కోసం వచ్చారు. ఈ సందర్భంగా వారు గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత, ఆలయ పూజారి మహేష్ శర్మ, మహంత్ మహావీర్నాథ్కు ఆలయ దుస్తుల నియమావళిని పాటించాలని, అలాగే వారి తలపాగాను తీసివేయమని కోరారు. కానీ ఇదే వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది.
ఈ సందర్భంగా మహంత్ మహావీర్నాథ్ మాట్లాడుతూ.. ఆలయ పూజారి మహేశ్ శర్మ భక్తులందరినీ వేధిస్తాడని ఆరోపించారు. తనతో పాటు ఉన్న మహంత్ గుండె రోగి అని, అయినప్పటికీ పూజారి తన తలపాగా, దుస్తులు తొలగించాలని బలవంతం చేశారని వివరించారు. మహేశ్ శర్మను ఆలయం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు ఒక మెమోరాండం సమర్పిస్తానని మహంత్ చెప్పారు. ఇదే సమయంలో పూజారి మహేశ్ శర్మ మాట్లాడుతూ.. ఆలయంలోకి ప్రవేశించడానికి ఒక నిర్దిష్ట దుస్తుల కోడ్ ఉందని, దానిని అందరూ పాటించాలని అన్నారు.
కీలకంగా సీసీటీవీ ఫుటేజ్ ..
ఈ సంఘటనను ఆలయ నిర్వహణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఆలయ నిర్వాహకుడు ప్రథమ్ కౌశిక్ మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని, ఎవరైనా దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
READ ALSO: Kafala abolished 2025: సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దు.. బానిసత్వం నుంచి బయటపడ్డ భారతీయ కార్మికులు..
