Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..

Lpl

Lpl

శ్రీలంక ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ‘జాఫ్నా కింగ్స్’ సహ-యజమాని, భారత మాజీ అండర్-19 క్రికెటర్ మంజోత్ కల్రాను శ్రీలంక క్రీడల అవినీతి నిరోధక విచారణ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టోర్నమెంట్ ఆరో సీజన్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో సెంచరీ సాధించి భారత్‌కు విజయాన్ని అందించిన మంజోత్ కల్రా, ఇటీవల స్పోర్ట్స్ బిజినెస్‌లోకి ప్రవేశించి ఈ ఏడాది ప్రారంభంలో జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టారు. అయితే.. ఎల్‌పీఎల్ (లంక ప్రీమియర్ లీగ్) మ్యాచ్‌ల సందర్భంగా ఒక ఆటగాడికి భారీగా డబ్బు ఆశ చూపి, ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై క్రీడలకు సంబంధించిన నేరాల నిరోధక ప్రత్యేక విచారణ విభాగం పోలీసులు ఆయనను కొలంబోలోని ఒక హోటల్‌లో అదుపులోకి తీసుకున్నారు.

సమాచారం ప్రకారం.. మంజోత్ కల్రా ఒక ఆటగాడికి దాదాపు 95 లక్షల రూపాయలు లంచం ఇవ్వబోతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుమారు పది రోజుల క్రితమే నిందితుడు తనను సంప్రదించాడని సదరు ఆటగాడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విచారణ ప్రారంభమైంది. జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీకి ఆడుతున్న శ్రీలంక ఆటగాళ్లు భానుక రాజపక్ష, అవిష్క ఫెర్నాండో, దునిత్ వెల్లాలగేలు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జాఫ్నా కింగ్స్ , గాల్ గ్యాలెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సిన రోజే ఈ అరెస్ట్ కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఎల్‌పీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, లంచాలు, అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలోనే బంగ్లాదేశ్‌కు చెందిన దంబుల్లా థండర్స్ యజమాని తమీమ్ రెహమాన్ కూడా బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు కోర్టులో అంగీకరించడంతో అతనికి నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు 2.4 కోట్ల రూపాయల జరిమానా విధించారు. ఈ వివాదాలు ఎలా ఉన్నప్పటికీ, టోర్నమెంట్ ఐదు జట్లతో షెడ్యూల్ ప్రకారం ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.