Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్‌తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..

Kurchee Thatha

Kurchee Thatha

Mohammed Kala Basha: ఒకే ఒక్క డైలాగ్‌తో రాత్రికి రాత్రే సంచలనం సృష్టించి, టాలీవుడ్ సూపర్ స్టార్ సినిమా పాటకే స్ఫూర్తిగా నిలిచిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ కాలా బాషా (66) ఇక లేరు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్ పరిసరాల్లో కాలం గడిపే ఆయన, తీవ్ర అనారోగ్యంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అలియాస్ మహ్మద్ పాషా మృతి చెందారు. మంగళవారం సాయంత్రం కృష్ణకాంత్ పార్క్ వద్ద నడుస్తున్న సమయంలో ఎండదెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడి వారు గమనించి CPR చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆయనను ఇంటికి తీసుకెళ్లినప్పటికీ, బుధవారం సాయంత్రం భార్య ఒడిలోనే కన్నుమూశారు.

వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన మహ్మద్ పాషా జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు చేరుకున్నారు. భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నప్పటికీ, ఆయన జీవితం రోడ్లపైనే సాగింది. బోరబండ ప్రాంతంలో నివసిస్తూ.. యూసుఫ్‌గూడ, కృష్ణకాంత్ పార్క్ పరిసరాల్లో తిరుగుతూ, బస్సుల్లో ఇంగ్లీష్ మాట్లాడుతూ భిక్షాటన చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తన కుటుంబంలో జరిగిన ఒక గొడవను వివరిస్తూ, ఆవేశంతో అన్న ‘‘ఆ కుర్చీని మడతబెట్టి..’’ అనే మాట సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. మీమర్స్, రీల్స్ క్రియేటర్ల పుణ్యమా అని ఆ డైలాగ్ ఎంతగా వైరల్ అయిందంటే.. ఆయన పేరు ‘కుర్చీ తాత’గా మారిపోయి రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేసింది. ఈ క్రేజ్ ఎంతవరకు వెళ్లిందంటే.. దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు థమన్ తమ ‘గుంటూరు కారం’ సినిమాలోని ఒక మాస్ సాంగ్ కోసం ఈ డైలాగ్‌ను రీమిక్స్ చేసి వాడుకున్నారు. మహేష్ బాబు డాన్స్‌తో ఆ పాట ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ సమయంలో చిత్ర యూనిట్ నుంచి ఆయనకు కొంత ఆర్థిక సహాయం కూడా అందింది. డిజిటల్ ప్రపంచంలో వచ్చిన ఈ గుర్తింపుతో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆయన చుట్టూ తిరిగాయి, కొందరు సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా తోచిన సాయం అందించారు. అయితే, సోషల్ మీడియాలో క్రేజ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నాళ్లకు యూట్యూబ్ ఛానళ్లకు కంటెంట్ పాతదైపోవడంతో క్రమంగా అందరూ ఆయనను మర్చిపోయారు. ఇంటర్వ్యూల ద్వారా వచ్చిన డబ్బులు కరిగిపోవడంతో, మహ్మద్ పాషా జీవితం మళ్లీ మొదటికొచ్చింది. అనారోగ్య సమస్యలు, మద్యం అలవాటు ఆయనను మరింత కుంగదీశాయి. గతంలో ఆయన చనిపోయినట్లు కొన్ని పుకార్లు రాగా, తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఆ వార్తలను ఖండించారు. ప్రస్తుతం నగరంలో ముదురుతున్న ఎండల తీవ్రత ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది.