Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..

Boat

Boat

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల బోటు గత 19 రోజులుగా కనిపించకుండాపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 3న వేటకు బయలుదేరిన ఈ బోటుతో 5వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ తెగిపోయింది. సాధారణంగా వేటకు వెళ్లినవారు తిరిగొస్తారనే నమ్మకంతో కుటుంబసభ్యులు ఈ నెల 13వ తేదీ వరకు వేచి చూశారు. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆందోళనకు గురై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి బాధితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను యంత్రాంగం వేగవంతం చేసింది.

ఈ గాలింపు చర్యల్లో విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న నాలుగు కోస్ట్ గార్డ్ నౌకలతో పాటు రెండు నేవీ హెలికాప్టర్లు బంగాళాఖాతంలో తీవ్రంగా శోధిస్తున్నాయి. విశాఖపట్నం, చెన్నై నుంచి వచ్చిన నేవీ నౌకలు సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగిస్తున్నాయి. కాకినాడ, విశాఖ కోస్ట్ గార్డ్ బృందాలు, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు పరస్పర సమన్వయంతో నేడు ఐదో రోజు కూడా గాలింపు ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.

మరోవైపు పోలీసులు బాధితుల సెల్‌ఫోన్ నంబర్లను సేకరించి, వారి కాల్ డేటాను విశ్లేషిస్తూ సాంకేతిక ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, సదరు బోటులో ముందస్తు జాగ్రత్తగా VHF ట్రాన్స్‌పాండర్ పరికరాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్లే కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయి, వారి లొకేషన్‌ను గుర్తించడం కష్టతరంగా మారింది. మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో వారి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలతో ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ త్వరలోనే అందించనున్నారు.