Site icon NTV Telugu

Hyderabad: వీర నారీమణులను సన్మానించిన కేంద్రమంత్రి

Kishan Reddy

Kishan Reddy

ఓ వైపు తుపాకీతో బెదిరిస్తున్నా.. ప్రాణాలు తెగించి తల్లీకూతుళ్లు దొంగలతో వీరోచితంగా పోరాడి వారికి ముచ్చెమటలు పట్టించిన సంగతి గుర్తుంది కదా?. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగానే.. వారి పోరాటాన్ని నెటిజన్లు, ప్రజలు పెద్ద ఎత్తున జేజేలు కొట్టారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేసింది. ఇందుకు హైదరాబాద్ వేదికైంది. బీజేపీ కార్యాలయంలో తల్లీకూతుళ్లకు పూలబొకే ఇచ్చి.. శాలువాలతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రాన్ని వారికి అందజేశారు. దీంతో వారిద్దరు సంతోషం వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే..
కొరియర్‌ డెలివరీ బాయ్ రూపంలో పట్టపగలు తుపాకీతో ఇంట్లోకి చొరబడి దోపిడీ కోసం బెదిరించిన దుండగుల్ని ఓ మహిళ ధైర్యంగా నిలబడి నిందితుడితో కలబడింది. దుండగుడితో బాగా పోరాడి అతడిని తిప్పి కొట్టింది. ఈ పోరాటంలో మహిళను కాపాడేందుకు తన 17ఏళ్ల కూతురు కూడా అండగా రావడంతో.. వారిద్దరూ కలిసి హెల్మెట్ తొలగించి అతనిని చితకబాదారు. ఈ దోపిడీ ప్రయత్నంలో తల్లి కూతుళ్ల నుంచి ఎదురైన ప్రతిఘటనతో నిందితుల్ని స్థానికులు వెంటాడి పట్టుకున్నారు.

గత గురువారం మధ్యాహ్నం బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. రసూల్‌పుర జైన్‌ కాలనీ లోని ఓ ఇంట్లో నవరతన్‌ జైన్‌ కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం మధ్యాహ్నం కాలనీ లోని వారు ఉన్న ఇంటికి కొరియర్ డెలివరీ బాయ్ వచ్చారు. కాకపోతే ఆ సమయంలో నవరతన్‌ జైన్‌ ఇంట్లో లేకపోవడంతో.. భార్య అమిత మేహోత్‌, కుమార్తె, పనిమనుషులు మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం 2 :15 గంటల సమయంలో ఇద్దరు యువకులు నేరుగా కొరియర్ అంటూ ప్రధాన గేటు నుంచి లోపలకు వచ్చారు. అయితే వారిని గుమ్మం బయటే ఉండాలని అమిత సూచిస్తుండగానే వచ్చిన ఇద్దరిలో ఒకరు నేరుగా ఇంట్లోకి చొరబడ్డాడు.

ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి నాటు తుపాకీని ఆమెకు గురిపెట్టాడు. మరో వ్యక్తి వంట గదిలో ఉన్న పనిమనిషి మెడపై కత్తి పెట్టి., ఆపై ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వాలని కోరాడు. దీంతో హెల్మెట్ ధరించిన వ్యక్తిని కాలితో తన్నిన అమిత, బయటకు నెట్టుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో హెల్మెట్ ఊడిపోగా నిందితుడి చేతిలో ఉన్న తుపాకీని గుంజుకుంది అమిత. ఆ వ్యక్తి ఏడాది క్రితమే ఇంట్లో పని కోసం వచ్చిన వ్యక్తిగా గుర్తించింది. ఇతడు యూపీకి చెందిన సుశీల్‌కుమార్‌గా పేర్కొన్నారు.

ఇక మరోవైపు అతనితో పాటు వచ్చిన మరో నిందితుడు ప్రేమ్ చంద్‌ ఇంట్లోని వంట గదిలో ఉన్న పనిమనిషిని కత్తితో బెదిరించగా.. సుశీల్‌ కుమార్‌ తో పెనుగులాట సమయంలో మరో మార్గంలో పారిపోయేందుకు ప్రయత్నం చేసాడు. కాకపోతే దారి దొరకకపోవడంతో లోపలే ఉండిపోయాడు. ఆపై పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలసులు ప్రేమ్‌చంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తుపాకీతో బెదిరించిన నిందితుడు రైల్లో పారిపోతుండగా కాజీపేటలో జిఆర్పీ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

 

Exit mobile version