ఖమ్మం జిల్లా ఏన్కూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) లో జరిగిన భారీ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కంచే చేను మేసిన చందంగా.. తాకట్టు పెట్టే బంగారాన్ని పరీక్షించి ధ్రువీకరించాల్సిన గోల్డ్ అప్రైజరే స్వయంగా నకిలీ నగలతో బ్యాంకును బురిడీ కొట్టించాడు.
కుట్ర ఎలా సాగిందంటే..?
ఈ కేసుకు సంబంధించి ఏన్కూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపాది సతీష్ (A1) అనే వ్యక్తి ఈ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాడు. తన హోదాను అడ్డం పెట్టుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి పక్కా పథకం వేశాడు. తన భార్య శ్రీపాది మౌనిక (A2), అత్త రామచంద్రోజు జయమ్మ (A3), బావమరిది రామచంద్రోజు నరేశ్ (A4) లతో కలిసి 2024లో విడతల వారీగా సుమారు 242.25 గ్రాముల నకిలీ ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టించాడు. సతీష్ స్వయంగా వాటిని అసలైన బంగారంగా సర్టిఫై చేయడంతో, బ్యాంక్ అధికారులు ఏమాత్రం అనుమానించకుండా నిందితులకు రూ. 9.53 లక్షల గోల్డ్ లోన్ మంజూరు చేశారు.
మోసం బయటపడిందిలా..
రుణం తీసుకున్న నిందితులు గడువు ముగిసినా అసలు కానీ, వడ్డీ కానీ చెల్లించలేదు. దీంతో ఆ లోన్ అకౌంట్లు అన్నీ ఎన్పీఏ (NPA – నిరర్థక ఆస్తులు) గా మారిపోయాయి. బ్యాంకు నిబంధనల ప్రకారం బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు ఆ ఆభరణాలను వేలం వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వేలం ప్రక్రియలో భాగంగా ఇతర నిపుణులతో బంగారాన్ని పునఃపరిశీలించగా, అవి కేవలం బంగారు పూత పూసిన నకిలీ నగలుగా తేలడంతో అధికారులు నివ్వెరపోయారు.
ముగ్గురి అరెస్ట్ ..
బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కేవీ ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, ఏన్కూరు ఎస్సై సంధ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురూ కలిసి పథకం ప్రకారం బ్యాంకును మోసం చేసినట్లు నిర్ధారించారు.
నిందితులైన సతీష్ (గోల్డ్ అప్రైజర్), జయమ్మ, నరేశ్లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సతీష్ భార్య మౌనిక (A2) ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినా.. నకిలీ పత్రాలు లేదా నకిలీ వస్తువులతో మోసాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.