హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేడు ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనాల రాకపోకలను ఏడాదిన్నర పాటు వన్వేగా మళ్లిస్తూ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం, ట్రాఫిక్ రద్దీ నివారణ పనుల నేపథ్యంలో ఇప్పటికే ఏప్రిల్ 5, జూన్ 21 తేదీల్లో రెండుసార్లు ట్రయల్ రన్లు విజయవంతంగా నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా పార్క్ పరిసరాల్లో స్పష్టమైన సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు.
ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఈ విధంగా ఉన్నాయి. పంజాగుట్ట వైపు నుంచి వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లాలంటే, నేరుగా రోడ్ నంబర్ 10 (ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి మార్గం) గుండా వెళ్లి, అక్కడ కేబీఆర్ పార్క్ కూడలి నుంచి కుడి మలుపు తీసుకుని రోడ్ నంబర్ 36 మార్గంలో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ చేరుకోవాల్సి ఉంటుంది. ఫిలింనగర్, ఒరిసా ఐలాండ్ వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లకుండా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న క్లాక్వైజ్ (వన్వే) మార్గంలోనే ప్రయాణించాలి.
ఈ నూతన ట్రాఫిక్ విధానాన్ని పర్యవేక్షించేందుకు పోలీసులు ప్రతిరోజూ నాలుగు షిఫ్టుల్లో సిబ్బందిని విధుల్లో ఉంచారు. అలాగే ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు గమనించేందుకు రెండు ప్రత్యేక డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. వాహనదారులు లేన్-1, లేన్-2 బోర్డులను గమనిస్తూ క్రమశిక్షణతో వాహనాలు నడపాలని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ లేదా మితిమీరిన వేగంతో వెళ్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆంక్షలు అమల్లో ఉన్నందున ప్రయాణికులు సైన్ బోర్డులను గమనిస్తూ సహకరించాలని సూచించారు.

