Site icon NTV Telugu

Waqf Board Chief: కర్ణాటక ఉపముఖ్యమంత్రి ముస్లిం అయి ఉండాలి.. వక్ఫ్ బోర్డు చీఫ్ కీలక వ్యాఖ్యలు

Waqf

Waqf

Waqf Board Chief: సున్నీ ఉల్మా బోర్డుకు చెందిన ముస్లిం నాయకులు తమ కమ్యూనిటీ నుండి గెలిచిన అభ్యర్థులకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదుగురు ముస్లిం ఎమ్మెల్యేలకు హోం, రెవెన్యూ, ఆరోగ్యం, ఇతర శాఖల వంటి మంచి శాఖలున్న మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు. “ఉప ముఖ్యమంత్రి ముస్లిం అయి ఉండాలని, మాకు 30 సీట్లు ఇవ్వాలని ఎన్నికలకు ముందే చెప్పాం.. మాకు 15 వచ్చాయి, తొమ్మిది మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు. దాదాపు 72 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పూర్తిగా ముస్లింల వల్లే గెలిచింది. ఒక సంఘంగా మనం కాంగ్రెస్‌కు చాలా ఇచ్చాం. ఇప్పుడు మనం ప్రతిఫలంగా ఏదైనా పొందే సమయం వచ్చింది. మాకు ఒక ముస్లిం ఉప ముఖ్యమంత్రి, ఐదుగురు మంత్రులు హోం, రెవెన్యూ, విద్య వంటి మంచి శాఖలు కావాలి. దీనికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. ఇవన్నీ అమలయ్యేలా చూడడానికి మేము సున్నీ ఉల్మా బోర్డు కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించాము.” అని వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్ షఫీ సాది చెప్పారు.అయితే, తొమ్మిది మందిలో ఎవరికి ఈ పదవులు వస్తాయన్నది అప్రస్తుతం.

Read Also: Karnataka: కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ.. డీకేకు బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేనా?

ఎవరు బాగా పనిచేశారు, మంచి అభ్యర్థి అనే దాని ఆధారంగా కాంగ్రెస్ నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. చాలా మంది ముస్లిం అభ్యర్థులు ఇతర నియోజకవర్గాలను కూడా సందర్శించారని, అక్కడ ప్రచారం చేశారని, హిందూ-ముస్లిం ఐక్యతకు భరోసా ఇచ్చారని షఫీ సాది తెలిపారు. కాబట్టి కాంగ్రెస్ గెలుపులో వారిదే కీలకపాత్ర అంటూ వ్యాఖ్యానించారు. ముస్లిం కమ్యూనిటీ నుంచి వారికి ఆదర్శవంతమైన డిప్యూటీ సీఎం ఉండాలని, ఇది కాంగ్రెస్ అధిష్ఠానం బాధ్యత అంటూ సాది చెప్పారు. ఎన్నికలకు ముందే ఈ డిమాండ్ చేశామని నేతలు పునరుద్ఘాటించారు. “ఇది ఖచ్చితంగా జరగాలి. ఎన్నికలకు ముందు ఇదే మా డిమాండ్‌. అది తప్పక నెరవేరుతుంది. ముస్లింలకు డిప్యూటీ సీఎం కావాలని మాత్రమే అడుగుతున్నాం.” అని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version