Karimnagar Tragedy: కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని శంకరపట్నం మండలం పరిధిలో కేశవపట్నం గ్రామంలో తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని తోపుడు బండిపై తీసుకెళ్లిన దృశ్యం స్థానికులను కలచివేసింది. యాకూబ్ అనే యువకుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తండ్రి వీరయ్య అతడిని చెప్పులు కుట్టే దుకాణం దగ్గరికి తీసుకువచ్చి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు గ్రామ పంచాయతీకి సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంతో నిరాశ చెందిన తండ్రి తన కుమారుడి శవాన్ని తోపుడు బండిపై ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. వరంగల్–కరీంనగర్ హైవే సమీపంలోనే ఇలాంటి ఘటన జరగడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యవసర సమయంలో కనీస సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ప్రాథమిక సదుపాయాల కొరత కొనసాగుతోందనే విషయాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.
Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..

Karimnagar