Bhatti Vikramarka: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమక్క సాగర్ ప్రాజెక్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వస్సల్ టోప్పో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సమక్క బ్యారేజ్, దేవాదుల ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రులు గోదావరి జలాల వినియోగం, కాలేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తాం: భట్టి విక్రమార్క
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జలాలను సాధ్యమైనంత మేర వినియోగించుకోవాలని నిర్ణయించిందన్నారు. సమక్క బ్యారేజ్లో గేట్లు మూసివేయడం వల్ల 71 మీటర్ల ఎత్తులో నీటి నిల్వలు ఉన్నాయని, అందువల్ల దేవాదుల ప్రాజెక్టు ద్వారా 7 మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నామని చెప్పారు. కన్నెపల్లి పంప్హౌస్ ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించే వారికి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. మేడిగడ్డ వద్ద గేట్లు మూసివేస్తే బ్యారేజ్కు ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారని, వారి సూచనలను పాటిస్తున్నామని తెలిపారు. పారే నీటినే ఎత్తుకునే అవకాశం ఉంటే మూడు బ్యారేజీలు ఎందుకు నిర్మించారో మాజీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
22 రిజర్వాయర్లకు యాక్షన్ ప్లాన్: పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 22 రిజర్వాయర్ల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని వెల్లడించారు. సమక్క బ్యారేజ్లో నీటిని నిల్వ చేస్తే పంపింగ్ సులభమవుతుందని చెప్పారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నుంచి ప్రవహించే నీటిని పంపింగ్ చేసే అవకాశం ఉన్నప్పుడు భారీ బ్యారేజీల నిర్మాణం ఎందుకు చేపట్టారో మాజీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇంజినీర్ల సూచనల మేరకే ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. గతంలో నిర్మించిన అనేక డ్యామ్లు సురక్షితంగా ఉండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన బ్యారేజీలు మాత్రం నాణ్యత సమస్యలతో నిలిచిపోయాయని ఆరోపించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా సాగు, తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మేడిగడ్డ వద్ద నీరు నిల్వ చేస్తే ప్రమాదం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. కాలేశ్వరం నీటిని ఉపయోగించకుండానే గత ఏడాది 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని నిపుణుల కమిటీ ఇప్పటికే నివేదించిందని తెలిపారు. మేడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గత ప్రభుత్వ హయాంలోనే సూచించిందని గుర్తుచేశారు. డిజైన్ మార్పులు, నాణ్యతా లోపాల కారణంగానే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. మేడిగడ్డపై ఐఐటీ బాంబే నిపుణులతో పాటు సైన్యం సహకారంతో సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నామని.. మరమ్మతులకు అవసరమైన నివేదికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి పనులు పూర్తి చేస్తున్నామని, ప్రస్తుతం 7 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నామని చెప్పారు.

