Nepal-Tibet Flood: నేపాల్-చైనా (టిబెట్) సరిహద్దు ప్రాంతంలో భారీ వరదలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వరదల ప్రభావంతో కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికులు గిరాంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయినట్లు సమాచారం. యాత్రికులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇషా ఫౌండేషన్ నిర్వహించిన కైలాష్ మానసరోవర్ యాత్రలో భాగంగా యాత్రికులు టిబెట్లోని గిరాంగ్ ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చైనా ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా భారీ వరద సంభవించింది. వరద ఉధృతికి ఇమ్మిగ్రేషన్ కేంద్రంతో పాటు గిరాంగ్ పట్టణంలోని చాలా ప్రాంతాలు నీట మునిగినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉన్న యాత్రికులతో సంబంధాలు తెగిపోయాయి. 77 మంది భక్తుల పరిస్థితిపై కొంతకాలం స్పష్టమైన సమాచారం అందకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
స్వయంగా గిరాంగ్కు చేరుకున్న సద్గురు
ఈ పరిస్థితిపై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు స్పందించారు. యాత్రికుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తాను స్వయంగా గిరాంగ్ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలిపారు. సహాయక, రెస్క్యూ చర్యల్లో అధికారులతో కలిసి పనిచేస్తున్నామని సద్గురు పేర్కొన్నారు. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా, బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
77 మంది భక్తుల ఆచూకీపై ఆందోళన
ఇషా ఫౌండేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మొత్తం 21 బృందాలు కైలాష్ యాత్రకు వెళ్లాయి. వారిలో 495 మంది సురక్షితంగా తిరిగి వచ్చారు. ప్రస్తుతం 743 మంది టిబెట్లో, 148 మంది నేపాల్లో ఉన్నట్లు సమాచారం. మరో 77 మంది యాత్రికులు ఇమ్మిగ్రేషన్ కేంద్రాల వద్ద చిక్కుకుపోయినట్లు లేదా వారితో సంబంధాలు లేకుండా పోయినట్లు ఫౌండేషన్ తెలిపింది. అదనంగా ముగ్గురు వాలంటీర్లు నేపాల్లోని తిమురే ప్రాంతంలో ఉన్నట్లు వెల్లడించింది.
కుటుంబాలకు సద్గురు భరోసా
వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న సద్గురు.. యాత్రికుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధితులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆందోళనను తాను అర్థం చేసుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైన ప్రతి సహాయక చర్యను చేపట్టేలా తాను స్వయంగా అక్కడ ఉన్నానని చెప్పారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ యాత్రికులకు సహాయం అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే భారీ వరదల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలు, సమాచార వ్యవస్థలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో రెస్క్యూ చర్యలు సవాలుగా మారాయి. యాత్రికుల ప్రస్తుత పరిస్థితి, వారి ఆరోగ్య స్థితి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలపై మరిన్ని అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.

