NTV Telugu Site icon

Jharkhand: చంపయ్‌ సోరెన్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి

Ce

Ce

జార్ఖండ్‌లో మరో రాజకీయ సంక్షోభం తలెత్తేలా కనిపిస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ మహాకూటమిలో అలజడి రేపింది. ఇటీవలే ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ మంత్రివర్గ విస్తరణ చేశారు. ఈ కేటినెట్ విస్తరణలో కాంగ్రెస్‌కు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అలకబూనారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే చంపయ్ సోరెన్ సర్కార్ విశ్వాస పరీక్ష నెగ్గింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం గట్టెక్కింది. అయితే తాజాగా చంపయ్ మంత్రివర్గ విస్తరణ చేయడం.. సరికొత్త తలనొప్పికి దారి తీసింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణ సరిగ్గా జరగలేదని పార్టీ కార్యకర్తలు, ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. అందుకే తాము ఢిల్లీకి చేరుకుని హైకమాండ్‌కి ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు చెప్పారు. సానుకూల చర్చలు జరిగాయన్నారు. చంపయ్ సర్కార్‌తో ఘర్షణ వాతావరణం కోరుకోవడం లేదని.. కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లుగా నడుచుకుంటామని ఆయన తెలిపారు.

మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అనంతరం చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవలే ఆయన మంత్రివర్గ విస్తరణ చేశారు.