Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!

JAyashankar Bhupalpally

JAyashankar Bhupalpally

Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పరకాల-భూపాలపల్లి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) వెంకన్నను బొగ్గు టిప్పర్ లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లా రోడ్డు రవాణా శాఖ కార్యాలయం ఎదుట వెంకన్న తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ అదుపుతప్పి అధికారుల వైపు దూసుకెళ్లింది. టిప్పర్ బలంగా ఢీకొనడంతో వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు ఆయన మృతదేహం నుజ్జునుజ్జయ్యిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

×
×
Ad

ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, వెంకన్న కేవలం 15 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో ఉండగానే ఆయన మృతి చెందడం జిల్లా అధికార వర్గాలను, రవాణా శాఖ సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు.