Jagga Reddy: ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాలు తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్, ఎమ్మెల్యేలకు ప్రలోభాల కుంభకోణంలో బీజేపీకి చెందిన నేతలు ఉండడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయని విమర్శించారు. కవిత, బీఎల్ సంతోష్ ఇద్దరూ నేరగాళ్లేనని, వారిద్దరినీ తక్షణమే అరెస్ట్ చేసి, వాస్తవాలు వెలికితీయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. వారిని అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వారిని అరెస్ట్ చేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ మహా ఉద్యమం చేపడుతుందన్నారు. గత నెలరోజులుగా లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులే నడుస్తున్నాయని, ఈ రెండు స్కాంలు నిజమని తేలిందని వెల్లడించారు. కవిత లిక్కర్ కేసులో ఉందని, అరెస్ట్ చేస్తామని బీజేపీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చేసిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
బీజేపీ నేతలు తామే నీతిమంతులమని, అవినీతి అంటేనే తమకు భయమని అనేక డ్రామాలు ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. నాడు యూపీఏ పాలన సందర్భంగా విపక్షంలో ఉన్న బీజేపీ అధికార కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎల్ సంతోష్ను కాపాడేందుకు బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఒకవేళ బీఎల్ సంతోష్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని అన్నారు. కాంగ్రెస్ నేతలను కూడా ట్రాప్ చేయాలని బీజేపీ చూస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు.
మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైందన్న ఆయన.. 25 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారని వెల్లడించారు. టీచర్ పోస్టులు ఎక్కువ ఖాళీగా ఉన్నాయని.. పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. 32 వేల టీచర్ పోస్టులు త్వరగా భర్తీ చేయాలన్నారు. 10 వేల మందికి ప్రమోషన్లు ఆగిపోయాయని.. ప్రమోషన్లు ఇస్తే పోస్టుల ఖాళీలు ఏర్పడతాయన్నారు. సీఎం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. షర్మిల లూజ్ టాక్ చేసిందని.. అంత ఈజీగా వదలనన్నారు. షర్మిల రాయలసీమ వారసురాలని.. తెలంగాణకు కోడలు అని ఆయన అన్నారు. ప్రజల గురించి ఆమె ఒక్కతే మాట్లాడినట్లు బిల్డప్ ఇస్తోందని ఆయన విమర్శించారు. షర్మిల బీజేపీ వదిలిన బాణం అంటూ జగ్గారెడ్డి ఆరోపించారు. షర్మిల వ్యవహారం టీఆర్ఎస్కు కలిసి వచ్చేలా ఉందన్నారు.