మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ టీవీ షో ‘జబర్దస్త్’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కొమురక్కపై కొందరు దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ఆమె అసిస్టెంట్ శ్రీనాథ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కొమురక్క ఇంట్లో కొంత బంగారం దొంగతనం జరిగింది. దీనిపై ఆమె తన అసిస్టెంట్ శ్రీనాథ్ను నిలదీయగా, తానే దొంగిలించానని అతను ఒప్పుకున్నాడు. అయితే, పోయిన బంగారాన్ని తిరిగి ఇస్తానని చెప్పి.. ఇవ్వకపోవడంతో, రెండు రోజుల క్రితం కొమురక్క అతడిని మరోసారి గట్టిగా మందలించారు.
Also Read : Lakshmi Manchu: ఆ విషయంలో నా భర్త జంకుతాడు..
దీంతో కక్ష పెంచుకున్న శ్రీనాథ్, తన స్నేహితులతో కలిసి ఆమెపై దాడికి ప్లాన్ చేశాడు. రాత్రి 11 గంటల సమయంలో సుమారు 8 మంది వ్యక్తులు కొమురక్క ఇంటికి వచ్చారు. తాము ఆమె అభిమానులమని, ఫోటోలు దిగాలని చెప్పి నమ్మించారు. ఆ మాటలు నమ్మి కొమురక్క ఇంటి బయటకు రాగానే, వారంతా ఒక్కసారిగా ఆమెపై దాడికి తెగబడ్డారు. ఈ హఠాత్పరిణామంతో కొమురక్క తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్చరణ్, నరేష్, పోతుల శివ, కిశోర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
