MI Captaincy: ఐపీఎల్ 2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇక అన్ని జట్లు ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ (MI)లో గందరగోళం మొదలైంది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే వాదనలు పెరిగాయి. తాజాగా ఈ అంశంపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. 2024లో రోహిత్ శర్మ నుంచి ముంబై కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పుడు హార్దిక్.. వైట్-బాల్ క్రికెట్లో భారత వైస్-కెప్టెన్గా ఉన్నాడని గుర్తు చేశాడు. అయితే, ఇప్పుడు పాండ్యా అంతర్జాతీయ క్రికెట్లో ఎలాంటి కెప్టెన్సీ బాధ్యతల్లో లేడని తెలిపాడు.. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై సారథ్య బాధ్యతలను సైతం సూర్యకు అప్పగించాలని అశ్విన్ పేర్కొన్నాడు. ఇటీవల సూర్య సారథ్యంలోని జట్టు టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుందని గుర్తు చేశాడు. ఇంకా ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ను తమ శాశ్వత కెప్టెన్గా చేయకపోవడం ఆందోళనకరమని తెలిపాడు.
“సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా ఉండటంలో ఆలోచించాల్సిన పనే లేదు. అతనికి కెప్టెన్సీ ఇవ్వాల్సిందే. ఇంకా కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోందని నేను ఖచ్చితంగా చెప్పగలను” అని అశ్విన్ తన హిందీ యూట్యూబ్ ఛానల్ ‘యాష్ కీ బాత్’లో వివరించాడు. ఇక పాండ్యా కెప్టెన్సీ సామర్థ్యాలను అశ్విన్ తప్పుపట్టలేదు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా మొదటి సీజన్లోనే టైటిల్ గెలుచుకోగా, రెండో సీజన్లో జట్టు రన్నరప్గా నిలిచిందని గుర్తు చేశాడు. అతను ముంబైకి వచ్చినప్పుడు, కెప్టెన్గా అదే పరంపరను కొనసాగిస్తాడని అంచనా ఉండేది. అయితే, తొలి ఏడాది రోహిత్ శర్మ ఉదంతాన్ని చక్కబెట్టడానికే గడిచిపోయిందని అశ్విన్ అన్నాడు. ఇక ముంబై ఇండియన్స్కు వచ్చిన కొత్తలో రోహిత్ శర్మ కెప్టెన్సీ మార్పు వ్యవహారంతో హార్దిక్ కొంత ఒత్తిడికి లోనయిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్కు కెప్టెన్సీ ఇవ్వకపోతే హార్దిక్ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మానసికంగా ఒక పెద్ద సవాలు అని అశ్విన్ విశ్లేషించాడు.
READ MORE: AI+ Nova 2 Ultra 5G: ఏఐ+ నోవా 2 అల్ట్రా 5జీ నోటిఫికేషన్ రింగ్ లైట్ ఫీచర్ తో.. రిలీజ్ కు రెడీ..
