కెప్టెన్గా తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకునేందుకు అడుగు దూరంలో ఉన్న శుభ్మన్ గిల్.. అంచనాల ఒత్తిడి తనపై ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగబోయే గ్రాండ్ ఫైనల్లో తమ సొంత మైదానం (హోమ్ అడ్వాంటేజ్) కలిసివస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇరు జట్లు కూడా తమ రెండో ఐపీఎల్ టైటిల్ కోసం ఇక్కడ తలపడుతున్నాయి. ఫైనల్ ముందస్తు ప్రెస్ కాన్ఫరెన్స్లో గిల్ మాట్లాడుతూ.. తమకు ఈ పిచ్, గ్రౌండ్ వాతావరణంపై పూర్తి అవగాహన ఉందని, గెలవడానికి ఎలాంటి క్రికెట్ ఆడాలో బాగా తెలుసని చెప్పాడు. గెలిస్తే ఈ సీజన్ అద్భుతంగా ఉంటుందని, ఒకవేళ గెలవకపోయినా మంచి సీజన్గానే మిగిలిపోతుందని అభిప్రాయపడ్డాడు.
క్వాలిఫయర్-1 లో ఆర్సీబీ చేతిలో 92 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన గుజరాత్.. ఆ తర్వాత ముల్లాన్పూర్లో జరిగిన క్వాలిఫయర్-2 లో రాజస్థాన్ను ఓడించి ఫైనల్కు చేరింది. ఈ ప్రయాణాల వల్ల శారీరకంగా ఆర్సీబీకి కొంత అనుకూలత ఉన్నప్పటికీ, ఫైనల్స్ అనేవి పూర్తిగా మానసిక బలానికి సంబంధించినవని, మైండ్ పరంగా ఎవరు సిద్ధంగా ఉంటే వారే గెలుస్తారని గిల్ పేర్కొన్నాడు. ఇతర జట్లు మొదటి బంతి నుంచే భారీ షాట్లకు ప్రయత్నిస్తుంటే, గుజరాత్ మాత్రం సాంప్రదాయ పద్ధతిలో వికెట్లు కాపాడుకుంటూ స్కోరు బోర్డును పరిగెత్తించే వ్యూహాన్ని నమ్ముకుంది. దీనిని సమర్థిస్తూ.. మ్యాచ్ గెలవడమే ముఖ్యం తప్ప ఏ పద్ధతిలో ఆడామనేది కాదని గిల్ అన్నాడు. తక్కువ డాట్ బాల్స్ ఆడే జట్టుకే ఎక్కువ స్కోరు చేసే అవకాశం ఉంటుందని చెప్పాడు.
అలాగే తమ బౌలర్లు కొత్త బంతితో టెస్ట్ మ్యాచ్ తరహా లెంగ్త్లో బౌలింగ్ చేస్తూ పరుగులను నియంత్రిస్తున్నారని, బ్యాట్స్మెన్కు అదే అత్యంత కష్టమైన బంతి అని వివరించాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫయర్-2 లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై తాము ఉపయోగించిన బౌన్సర్ల వ్యూహాన్ని గిల్ ప్రశంసించాడు. సూర్యవంశీ 96 పరుగులు చేసినప్పటికీ, తమ బౌలర్లు ప్రతి ఓవర్లోనూ బౌన్సర్లను ఎంతో ఖచ్చితత్వంతో ఉపయోగించారని, ఒక టీ20 మ్యాచ్లో ఇంత విజయవంతంగా, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌన్సర్లు వేయడం తాను ఎప్పుడూ చూడలేదని గిల్ కొనియాడాడు.
