ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలు, వివాదాస్పద ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్పై బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవాజిత్ సైకియా కీలక అప్డేట్స్ ఇచ్చారు. ఐపీఎల్ 2026 సీజన్లో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మరియు ఫైనల్తో కలిపి మొత్తం నాలుగు కీలక ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే వేదికలను మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సైకియా శనివారం వెల్లడించారు. ప్లేఆఫ్స్, ఫైనల్ నిర్వహణకు తగిన వేదికల ఎంపికపై బోర్డు ప్రస్తుతం కసరత్తు చేస్తోందని ఆయన తెలిపారు.
2023లో ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సైకియా స్పందించారు. ఈ నిబంధన వల్ల అభిమానులు మ్యాచ్లను బాగా ఎంజాయ్ చేస్తున్నారని, కొన్ని జట్లు 260 పరుగులు చేస్తే, మరికొన్ని తక్కువ స్కోర్లకే పరిమితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ రూల్పై ఫ్రాంచైజీల నుంచి ఎటువంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని, జట్లు దీనితో సౌకర్యవంతంగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ముగిసిన తర్వాత ఈ నిబంధనపై బోర్డు సమీక్ష నిర్వహిస్తుంది. అంతకుముందు ఈ రూల్ 2027 వరకు కొనసాగుతుందని బీసీసీఐ ప్రకటించినప్పటికీ.. టోర్నీ అనంతరం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్లో ఆటగాళ్లు , బౌలర్ల ప్రదర్శనను బట్టి చూస్తే, ఈ రూల్ ఒక పూర్తి ప్యాకేజీలా ఉందని ఆయన అభివర్ణించారు.
