Site icon NTV Telugu

Suryakumar Yadav: శభాష్ సూర్యకుమార్! కెప్టెన్‌గా తొలి ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లోనే అరుదైన ఘనత..

Suryakumar Yadav

Suryakumar Yadav

Suryakumar Yadav: నిన్న జరిగిన భారత్ vs అమెరికా మ్యాచ్‌ను ఇరు దేశాలు ఎప్పటికీ మర్చిపోలేవు. ఈ ఇన్నింగ్స్‌ను భారత క్రికెట్ చాలాకాలం గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే కెప్టెన్ ఇక్కడ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. భారత్‌ బ్యాటింగ్ పూర్తిగా కుదేలైన వేళ, జట్టును ఒంటిచేత్తో నిలబెట్టాడు సూర్యకుమార్. మ్యాచ్ ఆరంభం నుంచే భారత్‌కు ఏమాత్రం పట్టు దొరకలేదు. తొలి ఓవర్‌లో నాలుగు బంతులకు ఒక్క పరుగు కూడా రాలేదు. అమెరికా బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బంతులు వేసి, బ్యాట్స్‌మెన్‌ చేతులు విప్పే అవకాశం ఇవ్వలేదు. ఐదో బంతికి ఇషాన్ కిషన్ ఒక సిక్సర్ కొట్టి స్కోరు ఖాతా తెరిచినా, ఆ ఊపే ఎక్కువ సేపు నిలబడలేదు. రెండో ఓవర్‌లోనే ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ తొలి బంతికే అవుట్ అయ్యాడు. అలీ ఖాన్ వేసిన బంతిని నేరుగా డీప్ కవర్‌లో ఉన్న ఫీల్డర్ చేతికి కొట్టాడు. వాంఖడే స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ పెట్టిన ఫీల్డింగ్ సెట్టింగ్స్ చాలా చక్కగా పనిచేశాయి.

READ MORE: Instant Ragi Uttapam: కాల్షియం ఫుల్.. రుచి డబుల్.. పది నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రాగి ఉత్తప్పం

తిలక్ వర్మ కొద్దిగా ఆశ చూపించాడు. మూడో ఓవర్‌లో ముందుకు వచ్చి స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టాడు. తర్వాతి ఓవర్‌లో షాడ్లీ వాన్ షాల్క్విక్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆరవ ఓవర్‌లోనే మ్యాచ్ పూర్తిగా తలకిందులైంది. ఇషాన్ కిషన్ ఈజీ బాల్‌ను నేరుగా మిడ్-ఆన్‌కు కొట్టాడు. వెంటనే తిలక్ సైతం షార్ట్ బాల్‌ను సరిగ్గా టైమ్ చేయలేక కెప్టెన్ మోనాంక్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్‌లో శివమ్ దూబే స్లో బౌన్సర్‌ను అర్థం చేసుకోలేక అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా పూర్తిగా అయోమయంలో పడిపోయింది. ఆ తర్వాత రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ఒకరినొకరు అనుసరిస్తూ వికెట్లు పడిపోతుండటంతో 13 ఓవర్లకే భారత్ 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. స్కోర్‌బోర్డ్ చూసిన ప్రతి భారత అభిమాని గుండె కొట్టుకుంది.

READ MORE: T20 World Cup: జయహో భారత్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే వరల్డ్ రికార్డ్.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా రికార్డ్స్ బ్రేక్..

అలాంటి పరిస్థితిలో క్రీజ్‌పై నిలబడ్డాడు సూర్యకుమార్ యాదవ్. కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్‌లో ఇదే అతని తొలి ఇన్నింగ్స్. బాధ్యతను పూర్తిగా తన భుజాలపై వేసుకుని ఆడాడు. స్ట్రైక్‌ను తన వద్దే ఉంచుకుంటూ, అవసరం లేని రిస్కులు తీసుకోలేదు. బంతిని తన స్టైల్‌లో మైదానం నలుమూలకు పంపాడు. వికెట్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్న ఏకైక బ్యాట్స్‌మన్ సూర్యకుమార్‌. చివరి రెండు ఓవర్లలో అతడు అసలు ఆట మొదలుపెట్టాడు. ఆ రెండు ఓవర్లలోనే 34 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్‌లో నెట్రవాల్కర్ బౌలింగ్‌లో 21 పరుగులు తీసి భారత్ స్కోర్‌ను గౌరవప్రదమైన స్థాయికి తీసుకెళ్లాడు. 49 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచిన సూర్యకుమార్, కెప్టెన్‌గా తన తొలి టీ20 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లోనే అరుదైన ఘనత సాధించాడు. ఈ స్కోర్‌తో బాబర్ ఆజం వంటి స్టార్‌ను కూడా వెనక్కి నెట్టి, క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపుకు బాటలు వేసింది సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌నే.

Exit mobile version