Aryaveer Sehwag, Anvay Dravid: ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్ పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియా U19 జట్లను ప్రకటించింది. ఆస్ట్రేలియా U19తో జరగనున్న మూడు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్ల కోసం సెలెక్షన్ కమిటీ వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ స్క్వాడ్లో టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ లకు చోటు దక్కింది. బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ జట్ల ఎంపికను ప్రకటించారు.
ఇందులో భాగంగా.. మూడు వన్డేల కోసం ఎంపిక చేసిన జట్టుకు లక్ష్య రాయ్చందానీ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. యశబర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. మరోవైపు మల్టీ-డే మ్యాచ్లకు యశబర్ధన్ చౌహాన్ కెప్టెన్గా, లక్ష్య రాయ్చందానీ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
తొలిసారి భారత్ U19 జట్టులో చోటు:
వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తొలిసారి భారత U19 జట్టులో చోటు సంపాదించాడు. సెప్టెంబర్లో రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియా U19తో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో అతడు ఆడనున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆర్యవీర్ తాజాగా జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడాడు. దూకుడైన బ్యాటింగ్, భారీ షాట్లు తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ను గుర్తు చేశాయని క్రికెట్ అభిమానులు తెగ చర్చించుకున్నారు. 2024 కూచ్ బెహార్ ట్రోఫీలో మేఘాలయపై ఆర్యవీర్ ఏకంగా 297 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శన తర్వాత ఇప్పుడు తొలిసారి భారత U19 జట్టులోకి ఎంపికయ్యాడు.
మరోవైపు మాజీ భారత కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన అన్వయ్.. జూలైలో శ్రీలంక పర్యటనలో భారత్ U19 తరఫున 87 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ప్రదర్శనతో ఆకట్టుకున్న అన్వయ్కు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో మరో అవకాశం లభించింది. అయితే ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ ఇద్దరికీ మల్టీ-డే జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అంటే ఆస్ట్రేలియా U19తో జరిగే వన్డే మ్యాచ్ల్లో మాత్రమే వీరిద్దరూ కనిపించనున్నారు.
భారత్ U19 vs ఆస్ట్రేలియా U19 షెడ్యూల్:
భారత్, ఆస్ట్రేలియా U19 జట్ల మధ్య మూడు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్లు జరగనున్నాయి. మూడు వన్డేలు, తొలి మల్టీ-డే మ్యాచ్ రాజ్కోట్లో జరగనుండగా.. రెండో మల్టీ-డే మ్యాచ్ అహ్మదాబాద్లోని బీ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. వీటి షెడ్యూల్ ఇలా..
వన్డే సిరీస్:
సెప్టెంబర్ 18, 2026 – తొలి వన్డే, రాజ్కోట్,
సెప్టెంబర్ 21, 2026 – రెండో వన్డే, రాజ్కోట్,
సెప్టెంబర్ 23, 2026 – మూడో వన్డే, రాజ్కోట్.
మల్టీ-డే మ్యాచ్లు:
సెప్టెంబర్ 27–30, 2026 – తొలి మ్యాచ్, రాజ్కోట్.
అక్టోబర్ 5–8, 2026 – రెండో మ్యాచ్, అహ్మదాబాద్ బీ గ్రౌండ్.
భారత్ U19 వన్డే జట్టు:
లక్ష్య రాయ్చందానీ (C), యశబర్ధన్ చౌహాన్ (WC), రజత్ బఘేల్ (WK), ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుశాగ్ర ఓజా, అర్జున్ రాజ్పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), వి. యశ్వీర్, రోహిత్ యాదవ్, షావిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపతి వెంకట, కావ్యా పటేల్.
భారత్ U19 మల్టీ-డే జట్టు:
యశబర్ధన్ చౌహాన్ (C), లక్ష్య రాయ్చందానీ (WC), సాగర్ విర్క్, కుశాగ్ర ఓజా, మనాల్ చౌహాన్, కుశ్ పటేల్, మానవ్ కృష్ణ (WK), అభిప్రాయ్ బిస్వాస్ (WK), రోహిత్ యాదవ్, ఈశాన్ ఓం, అయాన్ అక్రమ్, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్.

