NTV Telugu Site icon

IND vs ZIM: నేడు జింబాబ్వేతో మూడో టీ20.. ప్రపంచకప్ విన్నర్స్‌కు చోటు! బెంచ్‌కే జైస్వాల్‌

India Playing 11

India Playing 11

IND vs ZIM Playing 11: జోరుమీదున్న భారత్ మరో పోరుకు సిద్ధమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా నేడు జింబాబ్వే, భారత్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా.. రెండో టీ20లో పంజా విసిరింది. ఇక యువ భారత్‌ను ఆపడం ఆతిథ్య జట్టుకు కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే జట్టులోకి ప్రపంచకప్ విన్నర్స్‌ శివమ్‌ దూబె, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ చేరారు. ఇది టీమిండియాకు కలిసొచ్చే అంశమే అయినా.. తుది జట్టును ఎంచుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరికి చోటివ్వాలనే అయోమయంలో మేనేజ్మెంట్ ఉంది.

యశస్వి జైస్వాల్‌ గైర్హాజరీలో ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ ఆకట్టుకున్నాడు. తొలి టీ20లో విఫలమైనా.. రెండో టీ20ల్లో 46 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. మూడో స్థానంలో క్లాసిక్ ఇన్నింగ్స్‌తో రుతురాజ్ గైక్వాడ్‌ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ జట్టులో ఉండటం ఖాయం. దీంతో టాప్ ఆర్డర్‌ను మార్చలేని పరిస్థితి. దాంతో యశస్వికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. ధ్రువ్‌ జురెల్‌ స్థానంలో సంజు శాంసన్‌ ఆడతాడు. సాయి సుదర్శన్‌ స్థానంలో శివమ్ దూబె ఆడే అవకాశముంది. హార్డ్‌ హిట్టర్‌ దూబెతో జింబాబ్వే స్పిన్నర్లకు సమస్యలు తప్పవు. రింకూ సింగ్ స్థానం పదిలంగా ఉండనుంది. ఇక బౌలింగ్‌ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ముకేశ్, అవేష్, బిష్ణోయ్, సుందర్‌ ఆడనున్నారు.

మరోవైపు రెండో టీ20లో ఘోరంగా విఫలమైన జింబాబ్వే మూడో టీ20లో భారత జట్టుకు పోటీ ఇవ్వాలని చూస్తోంది. కెప్టెన్‌ సికందర్‌ రజాతో పాటు ఆల్‌రౌండర్లు బెనెట్, జాంగ్వి బ్యాటింగ్ భారం మోయనున్నారు. పేసర్లు ముజరబాని, చటారలపై జింబాబ్వే భారీ ఆశలు పెట్టుకుంది. హిట్టర్లతో నిండిన భారత బ్యాటర్లను ఆపడం జింబాబ్వే బౌలర్లకు కష్టమే అని చెప్పాలి.

Also Read: Redmi 13 5G Price: భారత్‌ మార్కెట్‌లోకి రెడ్‌మీ 13 5జీ.. ఫోన్‌తో పాటే ఛార్జర్‌!

భారత్ తుది జట్టు (అంచనా):
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శివమ్ దూబె, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముకేశ్ కుమార్.