భారతదేశంలో హరిత రవాణాను ప్రోత్సహించడానికి , క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ముమ్మరంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఫ్లాగ్షిప్ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మరింత ఆర్థిక ఊతాన్ని అందించేందుకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. పీఎం ఈ-డ్రైవ్ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను పొడిగించేందుకు మంత్రిత్వ శాఖ అదనపు నిధులను కోరాలని యోచిస్తోంది. అయితే ఈ నిధుల పరిమాణంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
రూ.10,900 కోట్ల అంచనాతో 2024లో ప్రారంభమైన ఈ పథకంలో తొలుత ద్విచక్ర వాహనాల సబ్సిడీల కోసం రూ.1,772 కోట్లు కేటాయించారు. ఆశించిన దానికంటే నెమ్మదించిన విక్రయాల వేగం కారణంగా.. ఈ ప్రోగ్రామ్ను జూలై చివరి వరకు పొడిగించారు. ఇప్పుడు తాజా నిధులతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ పథకం ద్వారా 2.47 మిలియన్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మే 24 నాటికి దాదాపు 2.35 మిలియన్ల వాహనాలకు సబ్సిడీలు లభించాయి. ప్రస్తుతం బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి మొదటి ఏడాది కిలోవాట్ అవర్కు (kWh) రూ.5,000, రెండో ఏడాదిలో దానిని రూ.2,500 కు తగ్గిస్తూ మార్కెట్ కు అనుగుణంగా సబ్సిడీలను అందిస్తున్నారు.
ఆర్థిక సంవత్సరం 2022లో 2,52,787 యూనిట్లుగా ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు, ఆర్థిక సంవత్సరం 2026 నాటికి 1.46 మిలియన్లకు పెరిగాయి. అదే సమయంలో పెట్రోల్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13.2 మిలియన్ల నుంచి 11 మిలియన్లకు తగ్గాయి. ఆర్థిక సంవత్సరం 2027 కోసం పీఎం ఈ-డ్రైవ్కు రూ.1,500 కోట్లు కేటాయించారు. దీనిని అసలు ఈ-బస్సులు, ట్రక్కులు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం నిర్దేశించారు. తాజా నిర్ణయంతో ఈ బడ్జెట్ ప్రాధాన్యతలను తిరిగి సమీక్షించాల్సి ఉంటుంది.
