Site icon NTV Telugu

India’s E85 Fuel Revolution: భారత్‌లో ఇంధన విప్లవం.. ఇక పెట్రోల్ కాదు, ఆల్కహాల్‌తో వాహనాల పరుగులు!

India E85 Ethanol Fuel

India E85 Ethanol Fuel

India’s E85 Fuel Revolution: భారత్‌లో కొత్త విప్లవం రాబోతోంది. గల్ఫ్‌, ఇతర దేశాల నుంచి పెట్రోలియం దిగుమతులు చేసుకోవడం తగ్గనుంది. ఎందుకంటే ఇక నుంచి భారత్‌లో వాహనాలు త్వరలోనే ప్రధానంగా ఆల్కహాల్‌తో కూడిన ఇంధనంతో నడవవచ్చు. ఆల్కాహాల్‌తో కూడిన ఇంధనం అంటే ఏంటి? అనే సందేహం వచ్చిందా? ఇంధనంలో 85% వరకు ఇథనాల్, 15% పెట్రోల్ మిశ్రమంతో కూడిన E85 ఇంధనం అందుబాటులోకి రానుంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే ‘E20’ ఇంధనం ఇప్పటికే అందుబాటులోకి రాగా, ఇప్పుడు ఏకంగా 85 శాతం ఇథనాల్‌తో నడిచే ‘E85’ (ఫ్లెక్స్ ఫ్యూయల్) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను (Draft Rules) కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే విడుదల చేయనుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, చమురు సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

READ MORE: Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఒక టెర్రరిస్ట్.. కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. E85 అమలుపై ఇప్పటికే మార్కెట్ వర్గాలతో ఏకాభిప్రాయం కుదిరింది. వాహనాలపై ప్రాథమిక పరీక్షలు సైతం పూర్తయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న E20 పెట్రోల్‌కు ఇది అదనంగా, ఒక ప్రత్యేక గ్రేడ్ ఇంధనంగా లభిస్తుంది. అయితే, ఈ ఇంధనాన్ని వాడాలంటే సాధారణ ఇంజన్లు సరిపోవు. ‘ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్’ (FFVs) గా పిలిచే ప్రత్యేక ఇంజన్లను వాహన తయారీదారులు రూపొందించాల్సి ఉంటుంది. సాధారణ ఇంజన్లలో E85 ఇంధనాన్ని వాడితే సీల్స్, హోస్ పైపులు దెబ్బతినడమే కాకుండా, పనితీరు మందగించడం, తుప్పు పట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రత్యేకంగా రూపొందించిన ఇంజన్లు మాత్రమే ఈ అధిక ఇథనాల్ మిశ్రమాన్ని తట్టుకోగలవు. విశేషమేమిటంటే, E85 కోసం తయారు చేసిన ఇంజన్లు అవసరమైతే తక్కువ ఇథనాల్ ఉండే E50 లేదా E20 పెట్రోల్‌తో కూడా సురక్షితంగా నడుస్తాయి.

READ MORE: Pahalgam Attack: పహల్గామ్ గాయానికి ఏడాది.. ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందంటే!

ఈ ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చిందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 90 శాతం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. అందుకే చెరకు, మొక్కజొన్న, ఇతర ధాన్యాల నుంచి దేశీయంగా తయారయ్యే ఇథనాల్ వాడకం పెరిగితే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. స్వచ్ఛమైన పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ మండటం వల్ల కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. 2016 నుండే E85 ఇంధనంపై చర్చలు జరుగుతున్నాయి. 2021 నీతి ఆయోగ్ రోడ్‌మ్యాప్‌లో కూడా దీని గురించి ప్రస్తావించారు. ఇప్పుడు దేశంలో ఇథనాల్ నిల్వలు పుష్కలంగా ఉండటంతో దీనిని అమలు చేయడానికి మార్గం సుగమమైంది. ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే ముడిసరుకు అందించే రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే 100 శాతం ఇథనాల్‌తో నడిచే టయోటా వాహనాన్ని ప్రదర్శించి, ఈ టెక్నాలజీపై భరోసా కల్పించారు. అయితే, దీని అమలులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఇథనాల్ వాడకం వల్ల మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే పెట్రోల్ బంకుల్లో E85 కోసం విడిగా స్టోరేజ్ ట్యాంకులు, నోజిళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాబోయే రెండేళ్లలో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు భారతీయ రోడ్లపై పరుగులు తీసే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామం భారతదేశపు ఇంధన భద్రతలో ఒక కీలక మైలురాయిగా మారనుంది. ఒకవైపు అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో స్వదేశీ ఇంధనంపై ఆధారపడటం దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిస్తుంది.

Exit mobile version