Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..

Jurel

Jurel

ఇండియా ‘ఎ’ వర్సెస్ శ్రీలంక ‘ఎ’ మధ్య శ్రీలంకలోని గాలే వేదికగా జరుగుతున్న మొదటి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ రెండవ రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఎ’ జట్టు, సాయి సుదర్శన్ మరియు కెప్టెన్ ధ్రువ్ జురెల్ ల అద్భుత శతకాల సాయంతో తన మొదటి ఇన్నింగ్స్‌ను 111.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 452 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మొదటి రోజు ఓపెనర్ సాయి సుదర్శన్ 19 ఫోర్లతో 132 పరుగులు చేసి జట్టుకు మంచి పునాది వేయగా, దేవదత్ పడిక్కల్ (12), రుతురాజ్ గైక్వాడ్ (22) నిరాశపరిచారు.

అయితే.. మ్యాచ్ కు వర్షం అంతరాయం కల్పించినా.. కెప్టెన్ ధ్రువ్ జురెల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి 215 బంతుల్లో 141 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా షేక్ రషీద్ 63 పరుగులు చేసి రెండో రోజు ప్రారంభంలోనే అవుట్ అయినప్పటికీ, వీరిద్దరూ ఐదో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఈ సిరీస్‌కు ముందు భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ట్రై-సిరీస్‌ను గెలుచుకున్న ఉత్సాహంతో ఇండియా ‘ఎ’ బరిలోకి దిగింది. ఆ ట్రై-సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించిన వైభవ్ సూర్యవంశీ, ప్రస్తుతం సీనియర్ జట్టుతో కలిసి ఐర్లాండ్ పర్యటనలో (టీ20 అరంగేట్రం చేసే అవకాశం) ఉన్నందున ఈ టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో లేడు. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం భారతదేశంలో అందుబాటులో లేదు.

భారత జట్టులో సాయి సుదర్శన్, ఆయుష్ పాండే, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్ (కెప్టెన్), షేక్ రషీద్, హర్ష్ దూబే, సారాంశ్ జైన్, అన్షుల్ కంబోజ్, యష్ ఠాకూర్, ఆకిబ్ నబీ దార్ ఉన్నారు. శ్రీలంక జట్టులో పవంత వీరసింఘే, నిరోషన్ డిక్వెల్లా, నువనిందు ఫెర్నాండో, అషెన్ బండార, సహన్ అరాచ్చిగే (కెప్టెన్), రవిందు ఫెర్నాండో, అంజలా బండార, కవిందు పతిరత్నే, దులజ్ సముదిత, చామిక గుణశేఖర, దిలుమ్ సుదీర ఆడుతున్నారు.