Concussion: టీమిండియా పేసర్ తలకు గాయం.. మ్యాచ్ మధ్యలో నుంచే ఆస్పత్రికి!

  • టీమిండియా పేసర్ తలకు గాయం
  • మ్యాచ్ మధ్యలో నుంచే ఆస్పత్రికి
  • కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి యష్ ఠాకూర్
Prasidh Krishna

Prasidh Krishna

లక్నోలో ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ తలకు గాయమైంది. ఇండియా-ఎ తరఫున బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి హెల్మెట్‌కు బంతి బలంగా తగిలింది. ఇన్నింగ్స్ 39వ ఓవర్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హెన్రీ థోర్న్టన్ వేసిన బంతి ప్రసిద్ధ్ హెల్మెట్‌ను తాకింది. ప్రోటోకాల్ ప్రకారం.. ఇండియా జట్టు వైద్య సిబ్బంది వెంటనే మైదానంలోకి వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించాడు. ప్రసిధ్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

కంకషన్ టెస్ట్ తర్వాత సాయి సుదర్శన్‌తో కలిసి ప్రసిధ్ కృష్ణ బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ మూడు ఓవర్ల తర్వాత మైదానం వీడాడు. అనంతరం మహమ్మద్ సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. ప్రసిధ్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా విదర్భ ఫాస్ట్ బౌలర్ యష్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం ప్రసిధ్ బాగానే ఉన్నాడని, అతడిని వైద్య బృందం పర్యవేక్షిస్తోందని జట్టు వర్గాలు తెలిపాయి. మైదానం వీడిన వెంటనే స్కానింగ్ కోసం ప్రసిధ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రసిధ్ ఆడడంపై రేపు నిర్ణయం తీసుకుంటామని జట్టు వర్గాలు చెప్పాయి.

Also Read: IND vs BAN: టీమిండియాదే బ్యాటింగ్.. నాలుగు మార్పులతో బరిలోకి బంగ్లాదేశ్‌!

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ ఏమంత బాగాలేదు. 17 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చి ఏకైక వికెట్ పడగొట్టాడు. 29 ఏళ్ల ఈ బౌలర్ వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 420 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 194 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 16/3తో నిలిచింది. భారత్ ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది.