Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..

Pm Modi

Pm Modi

Independence Day 2026: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ వేడుకలకు నేతృత్వం వహించగా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాల్లో స్వాతంత్ర్య సంబరాలు మిన్నుముట్టాయి. ఎర్రకోటపై ప్రధాని మోడీ వరుసగా 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించారు. సరిగ్గా ప్రధాని జెండాను ఎగురవేసిన ఆ మహత్తర క్షణంలో, 1721 ఫీల్డ్ బ్యాటరీ (సెరిమోనియల్) సైనిక దళాల గన్నర్లు అందించిన సాంప్రదాయ 21 తుపాకుల సెల్యూట్ ఈ వేడుకల గంభీరతను, శోభను మరింత పెంచింది. ఇక, ఎర్రకోట స్వాతంత్ర్య వేడుకల చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశప్రజలను ఉత్తేజపరిచే జాతీయ గేయం ‘వందేమాతరం’ను ఎర్రకోట వేదికపై అధికారికంగా ఆలపించడం ఇదే తొలిసారి. ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికంటే ముందుగా సాగిన ఈ వందేమాతర గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మన స్వాతంత్ర్య పోరాటంలో విశేష ప్రాధాన్యం పొందిన వందేమాతరం గేయం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సంతోషకరమైన సందర్భంలో ఈ చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోవడం వేడుకల ప్రాధాన్యతను రెట్టింపు చేసింది. అంతేకాకుండా, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత భారత్) తీర్చిదిద్దడంలో దేశ యువశక్తి వహించాల్సిన కీలక పాత్రను చాటిచెప్పేలా ఈ ఏడాది ఉత్సవాలు సాగుతున్నాయి.

జెండా ఆవిష్కరణ అనంతరం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ… “నేడు ప్రతి గుండె త్రివర్ణ పతాకమే, ప్రతి ఇల్లు త్రివర్ణ పతాకమే” అంటూ ఆయన తన ప్రసంగాన్ని ఉద్వేగభరితంగా ప్రారంభించారు. ఇదే సమయంలో ఇటీవల దేశవ్యాప్తంగా సంభవించిన వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రాకృతిక విపత్తుల వల్ల ప్రాణాలు, ఆస్తులు కోల్పోయి బాధపడుతున్న బాధితులందరి ఆవేదనను తాము అర్థం చేసుకోగలమని, ఈ కష్టసమయంలో దేశం వారికి అండగా ఉంటుందని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు.