భారత్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం పాలైన అనంతరం జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఫలితంపై మాట్లాడిన రజా.. తమ జట్టు బౌలర్లు అక్కడక్కడా బాగానే బౌలింగ్ చేసినప్పటికీ, భారత బ్యాటర్ల ప్రతిభ, వారు ఆడిన షాట్లు నిజంగా ప్రశంసనీయమని కొనియాడాడు. ఫీల్డింగ్ విభాగంలో తాము మరింత మెరుగ్గా రాణించాల్సి ఉందని రజా అభిప్రాయపడ్డాడు. ‘ఫీల్డర్లు గనుక బౌలర్లకు కొద్దిగా మద్దతుగా నిలిచి ఉంటే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే అవకాశం ఉండేది. కానీ, భారత బ్యాటర్ల శ్రమను తక్కువ చేసి చూపలేం. ముఖ్యంగా ఇషాన్ కిషన్, తిలక్ వర్మల ఆటతీరును చూసి మేమంతా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అని పేర్కొన్నాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కు దిగి నిలకడగా రాణించడం చాలా కష్టమని, కానీ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో ఉంటూ దాన్ని సులువుగా చేసి చూపాడని మెచ్చుకున్నాడు.
220 పరుగుల భారీ లక్ష్య ఛేదనపై స్పందిస్తూ.. ‘మేము ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని ఛేదించాలనే మైండ్సెట్తోనే బరిలోకి దిగాం. మా ఓపెనర్లు ఆరంభంలో మంచి పునాదే వేశారు. అయితే అనుభవలేమి, సరికాని షాట్ సెలెక్షన్ కారణంగా వరుసగా వికెట్లు కోల్పోయి దెబ్బతిన్నాం. కానీ అందరికంటే ఎక్కువగా కెప్టెన్గా బ్యాటింగ్లో నేనే జట్టును నిరాశపరిచాను. నా నుంచి జట్టు పరుగులు ఆశిస్తోంది. గత రెండు టీ20 మ్యాచ్ల్లో నేను బ్యాట్తో రాణించలేకపోయాను, ఈ ఓటమికి ఆ బాధ్యత నాదే. తర్వాతి మ్యాచ్లో ఎలాగైనా పుంజుకుని జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని రజా స్పష్టం చేశాడు.

