IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్‌ రద్దు.?

Ind Vs Ire

Ind Vs Ire

IND vs IRE: భారత్ ఐర్లాండ్ పర్యటనకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. ఆ దేశంలో నెలకొన్న భద్రతా పరిస్థితులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు, పోలీసులపై దాడులు, జాత్యహంకార ఘటనలు చోటుచేసుకోవడంతో భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్గానిస్థాన్‌పై జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ మిగిలి ఉండగా.. ఆ తర్వాత భారత జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌కు వెళ్లనుంది.

భారత్, ఐర్లాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూన్ 26, 28 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ ప్రాంతంలో కత్తిపోటు ఘటన అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సంఘటన తర్వాత అల్లర్లు చెలరేగడంతో.. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు వాటర్ కేనన్లు, ప్లాస్టిక్ బుల్లెట్లను ఉపయోగించారు. ఇప్పటికే ఈ ఘటనలతో సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేసారు కూడా. దీంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

×
×
Ad

ఈ నేపథ్యంలో క్రికెట్ ఐర్లాండ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్లర్లు, హింసాత్మక ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ వారాంతంలో జరగాల్సిన దేశీయ టోర్నమెంట్ మ్యాచ్‌లను సురక్షితంగా నిర్వహించగలమా లేదా అనే అంశంపై వచ్చే 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రకటన ఐరిష్ సీనియర్ కప్, నేషనల్ కప్ మ్యాచ్‌లకు మాత్రమే సంబంధించినప్పటికీ.. పరిస్థితులు మరింత దిగజారితే భారత్‌తో జరగనున్న అంతర్జాతీయ సిరీస్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

భద్రతా పరిస్థితులు మెరుగుపడకపోతే వేదిక మార్పు, అదనపు భద్రతా ఏర్పాట్లు లేదా అత్యవసర పరిస్థితుల్లో సిరీస్‌ను వాయిదా వేసే అవకాశాలను కూడా క్రికెట్ ఐర్లాండ్ పరిశీలించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ ఐర్లాండ్ క్రికెట్‌కు ఆర్థికంగా ఎంతో కీలకం. భారత జట్టు పర్యటనతో భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియాలకు రావడంతో పాటు గణనీయమైన ఆదాయం కూడా లభిస్తుంది. మొదటి టీ20 మ్యాచ్ జూన్ 26న బెల్‌ఫాస్ట్‌లో జరగనుండటంతో సమస్యను పరిష్కరించేందుకు ఐర్లాండ్‌కు ఇంకా కొంత సమయం ఉంది. భారత్ పర్యటనకు ఎలాంటి ఆటంకం కలగకుండా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే ఐర్లాండ్ సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. ఈ పర్యటనతో శ్రేయస్ అయ్యర్ అధికారికంగా టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇక వైభవ్ సూర్యవంశీకి తొలిసారి జాతీయ జట్టులో అవకాశం లభించింది. తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. గాయంతో చాలా కాలం దూరంగా ఉన్న హర్షిత్ రాణా జట్టులోకి తిరిగి వచ్చాడు. మరోవైపు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కారణంగా జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇచ్చారు. ఐపీఎల్ 2026లో ఆకట్టుకున్న ప్రిన్స్ యాదవ్‌కు కూడా జట్టులో చోటు దక్కింది.

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.