Shreyas Iyer: మా ఆట దారుణంగా ఉంది.. మేం చెత్తగా ఆడాం.!

Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో 125 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసిన అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన అత్యంత దారుణంగా ఉందని అంగీకరించిన అతడు, ఇలాంటి ఓటమి ఏమాత్రం సబబు కాదని స్పష్టం చేశాడు. ఆటగాళ్లంతా వారి వైఫల్యాలను విశ్లేషించుకుని, మరింత బాధ్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మ్యాచ్ అనంతరం అన్నారు.

ఓటమిని అంగీకరించాల్సిందే:

మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. “మేం చాలా చెత్తగా ఆడాం. ఇంత భారీ తేడాతో ఓడిపోవడం ఏమాత్రం సబబు కాదు. ముందుగా ఈ ఓటమిని అంగీకరించాలి. ఆ తర్వాత మా ఆటతీరుపై పునరాలోచన చేసి ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించాల్సి ఉంది. ఈ పిచ్‌పై 200 పరుగులు ఇవ్వడం కూడా సరైన ప్రదర్శన కాదని వ్యాఖ్యానించాడు. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పవర్‌ప్లేలోనే 4 కీలక వికెట్లు కోల్పోవడం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందని అయ్యర్ అన్నారు. మంచి ఆరంభం లభించినా.. వరుస వికెట్లతో మా ఇన్నింగ్స్ పూర్తిగా కుప్పకూలిందని.. అక్కడే మ్యాచ్‌పై మా పట్టు చేజారిపోయిందని పేర్కొన్నాడు.

ప్రణాళికలు సరిపోవు.. అమలే కీలకం:

జట్టు సమావేశాల్లో ఎన్నో వ్యూహాలు రూపొందించినా, మైదానంలో పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిందేనని శ్రేయస్ పేర్కొన్నాడు. ఈ పిచ్‌పై బౌలర్లకు హార్డ్ లెంగ్త్ బంతులు బాగా పనిచేసాయి. కానీ మేం ఆ ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోయాం. ఛేదనలో భాగస్వామ్యాలు నిర్మించాల్సిన సమయంలో మా అమలు పూర్తిగా విఫలమైందని వివరించాడు. జట్టులోని ప్రతి ఆటగాడు మ్యాచ్‌పై ప్రభావం చూపేలా ఆడాల్సిన అవసరం ఉందని కెప్టెన్ సూచించాడు. వైఫల్యాల గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. ప్రతి ఆటగాడు తనదైన ముద్ర వేయాలని, జట్టు విజయానికి బాధ్యత తీసుకోవాలని భావించాలి. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మేం మరింత బలంగా తిరిగి వస్తాం అని శ్రేయస్ ధీమా వ్యక్తం చేశాడు.

వరుస పరాజయాలు:

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్‌ లోనూ విజయం సాధించలేదు. ఇంగ్లాండ్ పర్యటన ముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కోల్పోయిన భారత్, ఇంగ్లాండ్‌తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. దీంతో భారత్ వరుసగా ఐదు టీ20 మ్యాచ్‌ల్లో (ఒకటి రద్దు) విజయాన్ని అందుకోలేకపోవడం ఇదే తొలిసారి.