యూకే పర్యటనలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని టీమిండియా, మంగళవారం నాటింగ్హామ్లో ఇంగ్లాండ్తో జరగబోయే మూడో టీ20 మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ కీలక మ్యాచ్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో అదనపు పేసర్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట్లో ఓడిపోయింది. ఇందులో ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో 0-2తో ఘోర పరాజయం కూడా ఉంది.
మాంచెస్టర్లో జరిగిన రెండో టీ20లో బిష్ణోయ్ ఘోరంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 60 పరుగులు సమర్పించుకున్నాడు. అందులో మూడు నో-బాల్స్ వేయడమే కాకుండా, ఒకే ఓవర్లో 29 పరుగులు ఇచ్చి జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఇప్పటికే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వంటి స్పిన్నర్లు ఉండగా, మూడో స్పిన్నర్గా బిష్ణోయ్ను ఆడించడంపై విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ట్రెంట్ బ్రిడ్జ్ మ్యాచ్లో బిష్ణోయ్ను పక్కనబెట్టడం దాదాపు ఖాయం.
అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ కంటే, బంతిని స్వింగ్ చేయగల యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీసినప్పటికీ, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చేతిలో ఒకే ఓవర్లో 27 పరుగులు సమర్పించుకోవడం భారత్ను దెబ్బతీసింది. దీనివల్ల ఇంగ్లాండ్ 191 పరుగుల లక్ష్యాన్ని ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది.
గత ఆరు నెలలుగా ఫ్లాట్ పిచ్లపై ఆడిన భారత బ్యాటర్లు, ఇక్కడి అదనపు బౌన్స్ మరియు సామ్ కరన్ వంటి వారి వేరియేషన్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అభిషేక్ శర్మ మాత్రమే వరుసగా 59, 43 పరుగులతో రాణిస్తున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ పరుగులు చేస్తున్నా ఇంగ్లీష్ బౌలింగ్ను పూర్తిగా ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. అలాగే, సంజూ శాంసన్ స్థానంలో అరంగేట్రం చేసిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు.
వరుసగా రెండు మ్యాచ్ల్లో భారత్ 189, 190 పరుగులు చేసినా, అవి 25-30 పరుగులు తక్కువగానే అనిపించాయి. అయితే ఈ మ్యాచ్లో మంచి ప్రదర్శన దిశగా అడుగులు వేసేందుకు వైభవ్కు సీనియర్ ఆటగాళ్లు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైభవ్ నుంచి ఓ భారీ స్కోర్ నమోదు అవుతుందని క్రికెట్ అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. టీ20లో ఇప్పటి వరకు అభిషేక్ శర్మ పేరిట ఉన్న అత్యధిక స్కోర్(135)ను మించాలని అభిమానులు కోరుతూ.. కమాన్ సూర్యవంశీ అంటూ సోషల్ మీడియాల్లో కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్లోనైనా గెలిచి భారత్ పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.

